IND-ENG 2nd TEST Match : టీమిండియాలో కింగ్ కోహ్లి లేడు. సిరీస్ ప్రారంభానికి ముందే షమీ దూరమయ్యాడు. రాహుల్, జడేజా గాయాలబారినపడ్డారు. ఉన్న గిల్, శ్రేయస్ కూడా బ్యాటింగ్లో తడబడ్డారు. ఫలితంగా తొలి టెస్టు ఇంగ్లండ్కు సమర్పించుకున్నారు. అనూహ్య ఓటమి జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. స్పిన్ అంటేనే భారత్.. స్పిన్ మాయాజాలమే టీమిండియా బలం.. కానీ గత మ్యాచ్లో అరంగేట్ర స్పిన్నర్కే ఆటను అర్పించేశాం. సొంతగడ్డపై జరుగుతున్న సుదీర్ఘ టెస్టు సిరీస్లో టీమ్ఇండియా దంచి కొడుతుందనుకుంటే.. బజ్బాల్తో కౌంటర్ ఇచ్చి ఇంగ్లండ్ శుభారంభం చేసింది. ఉప్పల్లో సత్తాచాటలేకపోయిన రోహిత్ సేన.. విశాఖలోనైనా ఇంగ్లిష్ టీమ్ జోరుకు కళ్లెం వేసేలా..బజ్బాల్కు చెక్ పెట్టి భారత్ బాల్తో సత్తా చాటాల్సి ఉంది.
గత పర్యటనలో సైతం ఇంగ్లండ్ తొలి మ్యాచ్ గెలిచి సంబురపడ్డా.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్ల్లోనూ మనవాళ్లు ప్రత్యర్థిని స్పిన్ ఉచ్చులో బిగించి ఉక్కిరి బిక్కిరి చేశారు. మరి ఈసారి ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారనేది ఆసక్తికరం. మరో వైపు స్వీప్ షాట్లతో చెలరేగుతున్న స్టోక్స్ సేనను అడ్డుకట్టవేయాలంటే రోహిత్ సేన అసాధారణ ప్రదర్శన చేయాల్సిందే.
సుదీర్ఘ ఫార్మాట్లో దంచికొట్టడమే పరమావధిగా చెలరేగిపోతున్న ఇంగ్లండ్.. అదే బజ్బాల్ ఆటతీరుతో ఉప్పల్లో రోహిత్ సేనను కంగుతినిపించింది. తొలి రెండు రోజులు కనీసం పోటీలో లేని స్టోక్స్ సేన.. ఆ తర్వాత అసమాన పోరాటంతో మ్యాచ్ను విజయంతో ముగించింది. ఇప్పుడు ఉప్పల్ ఓటమికి విశాఖ వేదికగా బదులివ్వాలని హిట్మ్యాన్ జట్టు కాచుకొని ఉంటే.. అదే జోరును కొనసాగిస్తూ సిరీస్పై మరింత పట్టు సాధించాలని భావిస్తుంది పర్యాటక జట్టు.
సాగరతీరం విశాఖలో భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఐదు టెస్టుల సిరీస్లో తొలి రెండు మ్యాచ్లకు కింగ్ కోహ్లీ అందుబాటులో లేడు. గత మ్యాచ్లో రాణించిన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా కూడా గాయాలతో జట్టుకు దూరమయ్యారు. దీంతో తుది జట్టు ఎంపిక సెలక్టర్లకు కష్టంగా మారింది. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్తో పాటు మిడిలార్డర్లో రజత్ పాటిదార్ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
టీమ్ ప్రాక్టీస్, ఇతర అంశాలను బట్టి చూస్తే రజత్ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు సెలక్టర్లు. భారత్ తరపున పటిదార్ ఒకే ఒక వన్డే ఆడాడు. అశ్విన్, అక్షర్ మళ్లీ కీలకం కానుండగా జడేజా స్థానంలో మరో మాటకు తావులేకుండా కుల్దీప్ మైదానంలోకి దిగుతాడు. అయితే కుల్దీప్ వస్తే బ్యాటింగ్ బలహీనంగా మారిపోతుంది. ఇలాంటి స్థితిలో ఇంగ్లండ్ తరహాలో ఒకే ఒక పేసర్ ను ఆడించి బ్యాటింగ్ విభాగాన్ని పటిష్టం చేసుకోవడం అవసరం. అలా చేస్తే సిరాజ్ స్థానంలో సర్ఫరాజ్ అరంగేట్రం చేయవచ్చు. అయితే వీటన్నింటికంటే టాప్–4 బ్యాటింగ్ కీలకం కానుంది. ఓపెనర్లు రోహిత్, యశస్వి కాస్త ఓపిగ్గా ఆడితే.. విశాఖ వేదికగా భారీ స్కోరుకు శుభారంభం లభిస్తుంది.
విశాఖలో జరిగిన రెండు టెస్టుల్లో పిచ్ బ్యాటింగ్కు అనుకూలించింది. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలపై జరిగిన రెండు టెస్టుల్లోనూ భారీ స్కోర్లు నమోదు చేసిన విజయం సాధించింది టీమిండియా. ఈసారి కూడా తొలి రెండ్రోజులు పరుగులకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం విశాఖలో ఉష్ణోగ్రత 35 డిగ్రీలు ఉంటుంది. మ్యాచ్ రోజు కూడా సాగరతీరాన అధిక వేడి ఉండనుంది. వర్ష సూచన మాత్రం లేదు.
విశాఖ స్టేడియంలో అశ్విన్ రికార్డు సృష్టించే అవకాశం ఉంది. మరో నాలుగు వికెట్లు తీస్తే.. భారత్ నుంచి 500 టెస్టు వికెట్లు తీసిన రెండో బౌలర్గా రికార్డులకెక్కనున్నాడు అశ్విన్. విశాఖ పిచ్ రోహిత్కు బాగా అనుకూలిస్తుంది. హిట్మ్యాన్ వైజాగ్లో ఆడిన చివరి టెస్టులో రెండు ఇన్నింగ్స్ల్లోనూ సెంచరీలు బాదాడు. 2019లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో రోహిత్ సెంచరీలు చేశాడు. ఇవన్నీ బట్టీ చూస్తే విశాఖ వేదికగా పరుగులతో పర్యాటక జట్టుకు రోహిత్ సేన చుక్కలు చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి బజ్బాల్కు చెక్ పెట్టి భారత్ బాల్తో సత్తా చాటుతుందా..చతికిలపడుతుందా అనేది.