TDP – Janasena latest news(Andhra politics news): ఏపీలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ.. ఐదు దఫాలుగా అభ్యర్థులను ప్రకటించగా.. టీడీపీ-జనసేన కూడా అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. ఇప్పటికే ఇరుపార్టీ నేతలూ రెండు చోట్ల అభ్యర్థులను ప్రకటించగా.. తొలుత ఎంపీ సీట్లపైనే ఎక్కువ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆశావహుల సంఖ్య అధికంగా ఉన్నా పొత్తులో ఎవరిని సీటు వరిస్తుందోననే ఉత్కంఠ నెలకొంది.
ఏపీలో ఎన్నికల రణరంగం మొదలైంది. అభ్యర్థుల ఖరారు చేస్తూనే.. ఇంచుమించు పార్టీలన్నీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఐదు దఫాలుగా అభ్యర్థులను ఇప్పటికే వైసీపీ ప్రకటించింది. మిగిలిన కొన్ని స్థానాలపై కసరత్తు చేస్తోంది. అభ్యర్థులను ఖరారు చేసే పనిలో టీడీపీ-జనసేన ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీకి వెళ్తున్న ఇరు పార్టీలూ.. గెలుపు గుర్రాలపైనే దృష్టి సారించినట్లు సమాచారం.
ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీలో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉన్నా.. పొత్తు ధర్మం ప్రకారం సీట్లు పంపిణీ జరగనుంది. దీనికో తోడు జనసేన ప్రభావం ఎక్కువ ఉన్న స్థానాల్లో.. జనసైనికులకు అవకాశం ఇచ్చేందుకు టీడీపీ యత్నిస్తోంది. 11 చోట్ల తెలుగుదేశం పోటీ చేసేందుకు సన్నద్ధమైనట్లు సమాచారం. శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు, విశాఖలో భరత్, నరసాపురంలో రఘురామకృష్ణరాజు, తిరుపతిలో నీహారిక, విజయవాడలో కేశినేని చిన్ని ఉండగా.. జనసేన ఖాతాలో కాకినాడ, బందరు ఉంది. దీనికి తోడు వైసీపీ నుంచి వచ్చిన ముగ్గురు వైసీపీ సిటింగ్లకు అవకాశం ఇవ్వనున్నారు. మిగిలిన సీట్లపై కసరత్తు కొనసాగుతున్నట్లు సమాచారం. మారుతున్న సమీకరణలతో నెల్లూరు, ఒంగోలు పెండింగ్ ఉండగా.. కడపపైనా తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు.
రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాలకు గాను 13 చోట్ల టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థులను ఖరారు చేసింది. బయటకు అధికారికంగా ప్రకటించకపోయినా అంతర్గతంగా వారి అభ్యర్థిత్వాలపై పార్టీల్లో స్పష్టత వచ్చినట్లు సమాచారం. మిగిలిన స్థానాలపై కసరత్తు నడుస్తోంది. వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణలను దృష్టిలో ఉంచుకుని 2-3 సీట్లలో అభ్యర్థులను ఖరారు చేయకుండా.. పెండింగ్లో ఉంచారు. వైసీపీ నుంచి బయటకు వచ్చిన ముగ్గురు సిటింగ్ ఎంపీలకు.. టీడీపీ తరఫున టిక్కెట్ ఇవ్వనున్నారు. నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు, నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరికి టికెట్లు లభించనున్నాయి. మరో వైసీపీ ఎంపీకి కూడా టీడీపీ టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
25 లోక్సభ స్థానాల్లో జనసేనకు ఎన్ని ఇస్తారో నిర్దిష్టంగా తేలకపోయినా.. ఇప్పటికి 13 సీట్లలో మచిలీపట్నం, కాకినాడ సీట్లను ఆ పార్టీకి కన్ఫమ్ చేసినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖపట్నం, అమలాపురం, నరసాపురం, ఏలూరు, విజయవాడ, నరసరావుపేట, తిరుపతి, రాజంపేట, అనంతపురం, హిందూపురంలో టీడీపీ బరిలోకి దిగే అవకాశం ఉంది. మిగిలిన సీట్లలో అభ్యర్థులపై పరిశీలన కొనసాగుతోంది. విజయనగరం ఎంపీ సీటుకు వెంకటేశ్, కంది చంద్రశేఖర్ పోటీలో ఉన్నారు. అరకు స్థానంపై కసరత్తు మొదలు కాలేదు. రాజమండ్రి నుంచి మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్రావు పేరు ముందంజలో ఉంది. ఆయన కాని పక్షంలో బొడ్డు వెంకటరమణ, గన్ని కృష్ణ, శిష్ట్లా లోహిత్ పేర్లు పరిశీలనకు వచ్చే అవకాశం ఉంది. అమలాపురానికి మాజీ స్పీకర్ బాలయోగి కుమారుడు గంటి హరీశ్ పేరు ఖరారైనా.. తాజాగా మాజీ ఎంపీ బుచ్చిమహేశ్వరరావు కుమార్తె తనకు ఆసక్తి ఉందంటూ చంద్రబాబును కలిశారు.
గుంటూరుకు ప్రవాసాంధ్రుడు పెమ్మసాని చంద్రశేఖర్ పేరు గతంలోనే ఖరారైంది. కానీ ఎన్నారైలకు ఇవ్వడంపై పార్టీలో ప్రతికూల చర్చ ప్రారంభం కావడంతో ప్రత్యామ్నాయంగా భాష్యం రామకృష్ణ పేరు పరిశీలనకు వచ్చినట్లు సమాచారం. బాపట్ల స్థానం కోసం అరడజను పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. హరిప్రసాద్, ఉండవల్లి శ్రీదేవి, పనబాక లక్ష్మి, పాలపర్తి మనోజ్కుమార్, ఎంఎస్ రాజు పోటీలో ఉన్నారు. మరి కొన్ని పేర్లను కూడా ఆ పార్టీ నాయకత్వం క్షేత్ర స్థాయి పరిశీలనకు పంపింది.
ఒంగోలు, నెల్లూరు అభ్యర్థులపై కసరత్తును ప్రస్తుతానికి పెండింగ్లో ఉంచారు.ఇక్కడ అసెంబ్లీ స్థానాల్లో కొన్ని మార్పుచేర్పులు జరిగే అవకాశం ఉన్నందున వీటి విషయం తర్వాత ఆలోచించాలని నిర్ణయించారు. చిత్తూరు స్థానానికి తలారి ఆదిత్య, యశ్వంత్, హరిప్రసాద్, సినీనటుడు సప్తగిరి, కోనేరు ఆదిమూలం పేర్లు వినిపిస్తున్నాయి. అనంతపురంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పేరును ఖరారు చేసినా.. తాజాగా పూల నాగరాజు, అంబిక లక్ష్మీనారాయణ, బండి శ్రీకాంత్ పేర్లు పరిశీలనలోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కడపలో పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి, బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కుమారుడు రితేశ్రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
కర్నూలులో బస్తీ నాగరాజు, డాక్టర్ పార్థసారథి.. నంద్యాలలో సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి కుమార్తె శబరి, విద్యా సంస్థల యజమాని కేవీ సుబ్బారెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. జగన్ను ఎలాగైనా ఓడించాలని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే లక్ష్యంతో ఉన్న టీడీపీ-జనసేన.. పొత్తులో భాగంగా ఎలాంటి మార్పులైనా చేసే అవకాశం ఉందని సమాచారం.