Congress 6 Guarantees news(Telangana news live): తెలంగాణ ప్రజలకు తీపి కబురు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల్లో మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయిస్తామన్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ లబ్ధి జరిగేలా గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. మరో రెండు గ్యారంటీల అమలుకు సన్నాహాలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన దరఖాస్తులపై సచివాలయంలో కేబినేట్ సబ్ కమిటీ మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్షకు హాజరయ్యారు.
రూ. 500కు గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకాలపై సంబంధిత విభాగాల అధికారులతో చర్చించారు. ఈ మూడు గ్యారంటీల అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వీటిలో రెండింటిని తక్షణమే అమలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం చెప్పారు. ఒక్కో గ్యారంటీ అమలుకు ఎంత ఖర్చవుతుంది.. ఎంత మందికి లబ్ధి కలుగుతుందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ బడ్జెట్ లోనే అవసరమైన నిధులు కేటాయించాలని సీఎం ఆర్థిక శాఖకు సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లోపు మరోసారి కేబినేట్ సబ్ కమిటీతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ప్రభుత్వం ప్రకటించిన అయిదు గ్యారంటీలకు అర్హులైన వారి నుంచి గ్రామసభలు, వార్డు సభల ద్వారా దరఖాస్తులను స్వీకరించారు. అయిదు గ్యారంటీలకు మొత్తం కోటి 9 లక్షల 1255 దరఖాస్తులు వచ్చాయి. జనవరి 12వ తేదీ నాటికే వాటికి సంబంధించిన డేటా ఎంట్రీ పూర్తి చేసినట్లు అధికారులు సీఎంకు నివేదించారు.
కొంత మంది లబ్ధిదారులు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు సమర్పించినట్లు డేటా బేస్ ద్వారా గుర్తించారు. మొత్తం దరఖాస్తుల్లో 2.82 లక్షల డూప్లికేట్ దరఖాస్తులను అధికారులు గుర్తించారు. కొన్ని దరఖాస్తుల్లో రేషన్ కార్డులు, ఆధార్ కార్డుల నెంబర్లు లేవు. మరికొన్ని దరఖాస్తుల్లో నెంబర్లు తప్పుగా నమోదయ్యాయి. నిజమైన అర్హులు నష్టపోకుండా మరోసారి పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.