pawan kalyan new movie update(movie reviews in telugu)
గత కొంత కాలంగా టాలీవుడ్లో రీ-రిలీజ్ల ట్రెండ్ కొనసాగుతోంది. హీరోల బర్త్ డే లేదా మరేదైన ప్రత్యేకమైన రోజుల్లో సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలను రీ-రిలీజ్ చేయగా.. ఆడియన్స్ విశేషంగా ఆదరించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాను మళ్లీ థియేటర్లో రీ-రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాను రీ-రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. పవన్ కల్యాణ్, తమన్నా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 2012లో విడుదలైంది. ఇందులో పవన్ రాంబాబు పాత్రలో అన్యాయాలను ఎదిరించే ఒక జర్నలిస్టుగా నటించాడు. అప్పట్లో భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. యూనివర్సల్ మీడియా పతాకంపై డివివి దానయ్య ఈ మూవీని నిర్మించారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావిడి మొదలైన వేళ ఈ సినిమాని రీ రిలీజ్ చేయబోతుండడంతో సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇలాంటి సమయంలో ఈ సినిమా పవన్ కల్యాణ్కు ఎంతగానో ఉపయోగపడుతుందని భావించి ఈ మూవీని రీ-రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 7న ఈ మూవీని రీ రిలీజ్ చేయబోతున్నారు. ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.
అయితే ఎన్నికలే లక్ష్యంగా పలు రాజకీయ నేతల జీవితకథ ఆధారంగా తెరకెక్కుతోన్న కొన్ని సినిమాలు కూడా రిలీజ్కు సిద్ధంగా ఉన్నాయి. అందులో ‘యాత్ర2’ ఒకటి. మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫిబ్రవరి 8న రిలీజ్ కానుంది. జగన్ మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర నేపథ్యంలో ఈ మూవీని దర్శకుడు మహి తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్కు ముందురోజు అంటే ఫిబ్రవరి 7న పవన్ కల్యాణ్ ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా రీ-రిలీజ్ కాబోతుండటం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.