ఎన్నో ఆశలు, ఆకాంక్షల మధ్య వచ్చిన 2024 మధ్యంతర బడ్టెజ్ చివరకు ఊసూరుమనిపించింది. ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అయినా.. ఎన్నికలకు ముందు వచ్చిన బడ్జెట్ గనుక తమకు ఏమైనా మేలు చేసే ప్రకటనలుంటాయని దేశమంతా ఎదురుచూసింది.
గత ఏడాది తాము సాధించిన విజయాలను ఏకరువు పెడుతూ ప్రసంగం ఆరంభించిన ఆర్థిక మంత్రి.. ప్రత్యక్ష పన్నులు మూడు రెట్లు పెరిగాయని చెప్పినా, ఆదాయపు పన్నుదారులకు మాత్రం ఏ శుభవార్తా చెప్పకుండానే బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు.
25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశానని ధీమాగా చెప్పిన నిర్మల.. ద్రవ్యోల్బణం గురించి గానీ.. నిరుద్యోగ రేటు గురించిగానీ ప్రస్తావించకుండా జాగ్రత్త పడ్డారనిపించింది.
జైజవాన్.. జైకిసాన్..జై విజ్ఞాన్ నినాదానికి తోడు.. జై అనుసంధాన్ అనే మాటను చేర్చి మోదీజీ ప్రభుత్వం దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నారని గొప్పలు పోయిన నిర్మలమ్మ.. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆశించిన మేర కేటాయింపులేమీ చేయలేదు.
రైతుల సంక్షేమం గురించిగానీ, వైద్య ఆరోగ్య రంగం గురించి, మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు సంబంధించిన ఈ బడ్జెట్లో ఒక్కమాటా మాట్లాడలేదు.
కీలక రంగాలైన నీటి పారుదల, విద్యుత్ (సోలార్ పథకం తప్ప), ప్రాథమిక విద్య, ఉద్యోగాల కల్పన వంటి రంగాలకు రూపాయి కేటాయింపులూ జరగలేదు.
ఆఖరికి.. అన్ని వర్గాల సంక్షేమమే తమ లక్ష్యమని తన పద్దు ప్రసంగాన్ని ప్రారంభించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. చివరకు ఏ వర్గాన్నీ సంతృప్తి పరచలేకపోయింది.