నంది పురస్కారాలు అనేవి ఉత్తమ చిత్రాలకు, ఉత్తమ కళాకారులకు ఇస్తారు. ఈ సంప్రదాయం 1964 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో సినీ పరిశ్రమలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన కళాకారులకు రాష్ట్రప్రభుత్వం ప్రతి ఏటా ఈ పురస్కారాలను అందిస్తూ వచ్చింది.
అయితే గత పది ఏళ్లుగా రాష్ట్రప్రభుత్వం ఈ నంది పురస్కారాలను నిలిపివేసింది. పెండింగ్లో ఉన్న ఈ అవార్డులను ఇవ్వాలని సినీ ప్రముఖులు ఎంతో కాలంగా కోరుతున్నారు. ఇప్పటికే చిరంజీవి, మోహన్ బాబు వంటి నటులు ఈ విషయాన్ని గుర్తు చేశారు. అయినా ఈ విషయంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
అయితే తాజాగా తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. సీఎం రేవంత్ రెడ్డి ఈ అవార్డుల గురించి మాట్లాడారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జనవరి 31న జరిగిన గద్దర్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సినీ పరిశ్రమకు నంది అవార్డుల పేరుతో ఇచ్చే పురస్కారాలను ఇకనుంచి ‘గద్దరన్న అవార్డులు’ పేరుతో ఇస్తామని ప్రకటించారు.
గత పదేళ్లుగా పెండింగ్లో ఉన్న నంది అవార్డులను వచ్చే ఏడాది నుంచి ఇస్తామని తెలిపారు. ప్రతి ఏటా గద్దర్ జయంతి జనవరి 31న ఈ గౌరవ పురస్కారాలు అందజేస్తామని చెప్పారు. ఇకపై కవులకు, కళాకారులకు, సినీ ప్రముఖులకు రాష్ట్రప్రభుత్వం అధికారికంగా ఇచ్చుకునే ఈ అవార్డులకు గద్దర్ అవార్డులు అని పేరు పెట్టుకుందాం అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనపై పలువురు ప్రముఖులు ఆనందం వ్యక్తం చేశారు. కానీ మరికొందరిలో మాత్రం ఈ ప్రకటన కొత్త అనుమానాలకు దారి తీసింది. సాధారణంగా నంది అవార్డులు అనగానే.. నంది విగ్రహంతో కూడిన అవార్డును సెలబ్రెటీలకు అందిస్తారు. అయితే మరి గద్దర్ అవార్డు అంటే గద్దర్ ప్రతిమతో కూడిన అవార్డును అందిస్తారా? లేక నంది అవార్డునే ఇచ్చి దానికి గద్దర్ అవార్డు అని పేరు పెట్టబోతున్నారా? అంటూ గుస గుసలాడుకుంటున్నారు. అదీగాక నంది అవార్డులను పూర్తిగా ఆపేసి.. గద్దర్ పేరిట మరేదైనా కొత్త అవార్డులను తెస్తున్నారా? అంటూ కూడా పలువురిలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.