Ind vs Eng test update ( sports news in Telegu) :
మొదటి టెస్ట్ ఓటమితో టీమ్ ఇండియా వైఫల్యాలపై ప్రతి ఒక్కరూ బాణాలు ఎక్కుపెడుతున్నారు. అయితే ఎంత వెనకేసుకు వచ్చినా, గణాంకాలు అబద్ధాలు చెప్పవు కదా.. వాటిని ఆధారం చేసుకునే అందరూ మాట్లాడుతున్నారని అంటున్నారు. ప్రస్తుతం టీమ్ ఇండియాలో ఆడుతున్న నలుగురు ఆటగాళ్ల ఫామ్ అందరినీ కలవర పరుస్తోంది. వారిలో రోహిత్ శర్మ కూడా ఒకరనే విమర్శలు మిన్నంటుతున్నాయి.
మిగిలిన ముగ్గురిలో శుభ్ మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఇక నాలుగో క్రికెటర్ మహ్మద్ సిరాజ్…
కెప్టెన్ రోహిత్ శర్మ ఆడిన చివరి ఆరుటెస్టుల్లో అత్యధిక స్కోరు 39 మాత్రమేనని అంటున్నారు.
శ్రేయాస్ అయ్యర్ గత పది టెస్ట్ ఇన్నింగ్స్ ల్లో చేసిన అత్యధిక స్కోరు 35 మాత్రమే..
గిల్ అయితే సరేసరి. గత 11 టెస్ట్ మ్యాచ్ ల్లో ఒక సెంచరీ తప్ప, 40 అత్యధిక స్కోరు దాటలేదు.
ఆరంభ ఓవర్లలో మహ్మద్ సిరాజ్ ని మించినవారు లేరు. కానీ తనకి బౌలింగ్ కోటా సరిగా ఇవ్వడం లేదనే విమర్శలున్నాయి. ఈ అంశంపై టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
మొన్నటి వరకు శుభ్ మన్ గిల్ పై ఫోకస్ పెట్టిన సోషల్ మీడియా ఇప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ మీద పడింది. దీంతో గిల్ బతుకుజీవుడా? అని రెండో టెస్ట్ కి మానసికంగా సిద్ధమవుతున్నాడు.
శ్రేయాస్ అయ్యర్ ని ఇప్పటికే రంజీ ట్రోఫీలు ఆడమని టీమ్ మేనేజ్మెంట్ సలహా ఇచ్చి ఆడించింది. ఆల్రడీ గుర్తించిన వ్యక్తిని, మళ్లీ కొంపలు అంటుకుపోయినట్టు అర్జంటుగా ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కి తీసుకువచ్చారు. ఈ ఫలితాన్ని ప్రస్తుతం టీమ్ ఇండియా అనుభవిస్తోందనే విమర్శలున్నాయి.
జట్టు 11మందిలో ఒక్కరిద్దరు ఆడకపోతే పర్వాలేదు. కానీ నలుగురు ఫెయిలైతే ఎలా? అని అంటున్నారు. ఫెయిల్ అవుతున్నారని తెలిసి ఆడిస్తున్నారు, అదే సమస్యని అంటున్నారు. గత మూడేళ్లుగా బాగా ఆడుతున్న రజత్ పాటీదార్, సర్ఫరాజ్ ఖాన్ లను ఇప్పటికే తీసుకురావాలి కదా అంటున్నారు. కేఎల్ రాహుల్, విరాట్ కొహ్లీ లేరని వారికి అవకాశాలు ఇస్తున్నారు. లేదంటే ఫామ్ కోల్పోయిన టీమ్ తోనే మళ్లీ దిగేవారని విమర్శిస్తున్నారు.