Chiranjeevi latest Updates ( today tollywood news ) :
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం దర్శకుడు వశిష్ట డైరెక్షన్లో ‘విశ్వంభర’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎంతో ప్రతిష్టాత్మంగా తెరకెక్కుతోన్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాకుండా ఇటీవల ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసి ఆ అంచనాలను మరింత రెట్టింపు చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్తో తమ అభిమాన హీరో చిరంజీవికి హిట్ పక్కా అనే కాన్ఫిడెన్స్లో ఫ్యాన్స్ ఉన్నారు.
దీంతో చిరంజీవి నటించబోయే తదుపరి మూవీపై అందరిలోనూ ఆసక్తి మొదలైంది. ‘విశ్వంభర’ చిత్రం తర్వాత చిరంజీవి ఎలాంటి కథను ఎంచుకోబోతున్నారు. ఏ డైరెక్టర్తో చేయబోతున్నారు అనే ఉత్కంఠ అందరిలోనూ స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా చిరు నెక్స్ట్ మూవీకి సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
మెగాస్టార్ చిరు తాజాగా ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి అభిమానులు ఏంటా సినిమా అంటూ తెగ ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ప్రముఖ రచయిత, దర్శకుడు బివిఎస్ రవి ఓ కథను గతంలో చిరంజీవికి ఇచ్చారట. ఆ కథకు సరైన దర్శకుడి కోసం ఇన్నాళ్లు ఎదురుచూస్తూ వచ్చారు.
ఆ మధ్య చాలా మంది దర్శకుల పేర్లు వినిపించాయి. అందులో కళ్యాణ్ కృష్ణ ఒకరు. ఈ దర్శకుడు చిరుతో ఓ మూవీ చేయబోతున్నాడని అంతా అనుకున్నారు. కానీ ఆయన వ్యక్తిగత వ్యవహారాలతో బిజీగా ఉన్నాడు. దీంతో మళ్లీ దర్శకుల కోసం వేటను స్టార్ట్ చేశారు. ఇప్పటికి వారి వేటకి ఫలితం లభించినట్లు తెలుస్తోంది. ఈ కథను దర్శకుడు హరీష్ శంకర్కు అప్పగిస్తున్నట్లు సమచారం అందింది.
అంతేకాకుండా ఈ సినిమాను నిర్మించడానికి ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా సంస్థ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం ఎంత బడ్జెట్ అయినా పెట్టి.. నిర్మాణ బాధ్యతలను మాత్రం చిరంజీవి కుమార్తె సుస్మితకు అప్పగించడానికి సన్నాహాలు చేస్తోందట. ఈ మేరకు లాభాల్లో సగం వాటా తీసుకోవడానికి పీపుల్స్ మీడియా ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే తన తండ్రి చిరంజీవితో సినిమా నిర్మించాలని చిరకాలంగా ప్రయత్నిస్తున్న సుస్మిత కోరికను చిరు తీర్చబోతున్నాడు అని గుసగుసలు వినిపిస్తున్నాయి.