సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఉదయం 11 గంటలకు లోక్సభలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రసంగిస్తున్నారు.
అంతకుముందు కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి భవన్కు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ వెళ్లారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసి బడ్జెట్ సమర్పణకు అనుమతి తీసుకున్నారు. రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్కు చేరుకుని బడ్జెట్ ప్రవేశపెట్టారు.
సబ్ కా సాత్ సబ్కా వికాస్ నినాదం భారత ఆర్థిక మూలాలను పటిష్టం చేసిందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పదేళ్లలో మోదీ నాయకత్వంలో అమలు చేసిన సంస్కరణలు ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేశాయని స్పష్టంచేశారు. బాధ్యతాయుతంగా తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థలో కొత్త ఉత్సాహాన్ని నింపాయన్నారు.
నూతన సంస్కరణలతో కొత్త పారిశ్రామికవేత్తలు పుట్టుకొచ్చారని ఆర్థికమంత్రి పేర్కొన్నారు. ఆత్మనిర్భర భారత్ నిర్మాణంలో ప్రతి వ్యక్తి భాగస్వాములయ్యారని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దశ, దిశ ఏర్పడిందని వివరించారు. సమ్మిళిత, సంతులిత ఆర్థిక విధానాలతో చిట్టచివరి వ్యక్తికీ ప్రగతి ఫలాలు అందాయన్నారు.
ఇంటింటికీ విద్యుత్ సరఫరా చేస్తున్నామని నిర్మలమ్మ చెప్పారు. ఇబ్బందుల్లో వ్యవసాయ రంగానికి కొత్త ఊపిరి ఊదామన్నారు. మద్దతు ధరలు, పెట్టుబడి రాయితీలతో రైతులకు ప్రయోజనాలు కల్పించామని చెప్పారు.
బడ్జెట్ను డిజిటల్ రూపంలో కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ఆర్థిక మంత్రి ప్రసంగం పూర్తైన తర్వాత.. యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్లో బడ్జెట్ పూర్తి కాపీని చూడొచ్చు.
2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్గా అవతరించేందుకు కృషి చేస్తున్నామని నిర్మలా సీతారామన్ కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. పేదలు, మహిళలు, యువత, అన్నదాలను శక్తిమంతం చేశామన్నారు.కుల, మత ఆర్థిక బేధాలు లేకుండా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. 2047నాటికి అసమానత, పేదరికం కనబడకుండా చేయాలన్నదే మోదీ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
పేదరికం నిర్మూలనకు బహుముఖీయ విధానాలతో పనిచేశామని నిర్మలమ్మ చెప్పారు.పేదలకు జన్ధన్ ఖాతాల ద్వారా రూ.34లక్షల కోట్లు అందించామన్నారు. 78 లక్షల మంది వీధి వ్యాపారులకు ఆర్థికసాయం అందించామని తెలిపారు.రూ.2.20 లక్షల కోట్ల పూచీకత్తు లేని రుణాలు అందించామని వెల్లడించారు.
4 కోట్ల మంది రైతులకు ఫసల్ బీమా యోజన కింద పంట బీమా అందజేస్తున్నామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. గత పదేళ్లలో 7 ఐఐటీలు, 16 ట్రిపుల్ ఐటీలు, 7 ఐఐఎంలు, 15 ఎయిమ్స్లు, 390 యూనివర్సిటీలు ఏర్పాటు చేశామన్నారు. 10 ఏళ్లలో ఉన్నత విద్య చదివే అమ్మాయిల సంఖ్య 28శాతం పెరిగిందన్నారు.
4.50 కోట్ల మందికి బీమా సౌకర్యం కల్పించామని ఆర్థికమంత్రి వెల్లడించారు. 11.8 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించామన్నారు. వ్యవసాయ రంగంలో కొత్త సాంకేతికతతో విలువ జోడించే విధానాలు తెచ్చామన్నారు. స్కిల్ఇండియా మిషన్తో కోటి 40 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ అందించామన్నారు.
యువతకు ముద్రా యోజనతో రూ.25 లక్షల కోట్లు రుణాలుగా ఇచ్చామని నిర్మలా సీతారామన్ తెలిపారు. జీఎస్టీ లాంటి ట్యాక్స్ సంస్కరణలు ట్యాక్స్ పరిధిని పెంచాయన్నారు. క్రీడల్లో సాధించిన పతకాలు యువతలో ఆత్మ స్థైర్యాన్ని నింపుతున్నాయన్నారు.మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్లు కల్పించామన్నారు. ట్రిపుల్ తలాక్ చట్ట విరుద్ధమని ప్రకటించామన్నారు.
ప్రజల ఆదాయం 50శాతం పెరిగిందని నిర్మలమ్మ ప్రకటించారు. ప్రపంచదేశాలు ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయన్నారు. భారత్ మాత్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని స్పష్టంచేశారు. అన్ని రంగాల్లో ఆర్థికవృద్ధి కనబడుతోందన్నారు.
జీడీపీ అంటే గవర్నెన్స్, డెవలప్మెంట్, పెర్ఫార్మెన్స్ అని కొత్త అర్థం ఇచ్చామన్నారు. స్టార్టప్ ఇండియా ద్వారా యువతను పారిశ్రామికవేత్తలుగా తయారు చేశామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో పీఎం ఆవాస్ యోజన ఇళ్లలో 70 శాతం మహిళల పేరుపైనే ఇచ్చామని తెలిపారు. ఈ పదేళ్లలో ద్రవ్యోల్బణాన్ని సమతుల్యంగా ఉంచామన్నారు.
జిల్లాలు, బ్లాక్ల అభివృద్ధి కోసం రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నామన్నారు నిర్మలా సీతారామన్. రూఫ్ టాప్ సోలార్ పాలసీ కింద కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. బస్తీలు, అద్దె ఇళ్లలో ఉండేవారి సొంత ఇంటి కలను నిజం చేస్తామన్నారు.