మరికాసేపట్లో కేంద్ర బడ్జెట్ దేశం లోక్సభకు రానున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మొబైల్స్ ఉత్పత్తిలో వాడే విడి భాగాలపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. సిమ్ సాకెట్లు, మెటల్ భాగాలు, సెల్యులార్ మాడ్యూల్స్, ఇతర మెకానికల్ వస్తువులపై దిగుమతి సుంకాన్ని ఇప్పుడు 5 శాతం తగ్గించనున్నట్లు కేంద్రం ప్రకటించింది.
మిడిల్ కవర్, మెయిన్ లెన్స్, బ్యాక్ కవర్, జీఎస్ఎం యాంటెన్నా, పీయూ కేస్, సీలింగ్ గాస్కెట్, సిమ్ సాకెట్, స్క్రూలు, ఇతర ప్లాస్టిక్, మెటల్ మెటీరియల్లపై కూడా దిగుమతి సుంకాన్ని తగ్గించింది. కాగా.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మీద కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధానికి, ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తాజా నిర్ణయంతో దేశీయ ఫోన్ తయారీ కంపెనీలకు మరింత ఊరట కలుగనుందని అశ్వనీ వైష్ణవ్ అభిప్రాయపడ్డారు. దీనివల్ల మొబైల్ఫోన్ల ధరలూ తగ్గనున్నాయని, మేక్ ఇన్ ఇండియా ప్రయత్నం మరింత ముందుకు పోనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.