Budget 2024 : ప్రస్తుతం ప్రవేశపెడుతున్న బడ్జెట్ తాత్కాలిక బడ్జెట్టే అయినా.. తమకు కొంతైనా ఊరట లభిస్తుందేమోనని వేతన జీవులు, మధ్య తరగతి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమ పన్ను వ్యయాన్ని తగ్గించడానికి వీలు కల్పించేలా సెక్షన్ 80సీ, సెక్షన్ 80డీ వంటి వివిధ సెక్షన్ల కింద పన్ను మినహాయింపు పరిమితులను పెంచితే బాగుండునని కోరుకుంటున్నారు.
ఆదాయపన్ను మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షలను రెట్టింపు చేయాలని అభిలషిస్తున్నారు. నిరుడు బడ్జెట్ సమయంలో కొత్త ఆదాయ పన్ను విధానాన్ని ఎంచుకునే వారి కోసం స్లాబ్ రేట్లను సవరించిన సంగతి తెలిసిందే. సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపు పరిమితి రూ.1.5 లక్షలుగా ఉంది. దశాబ్దకాలంగా ఆ పరిమితిలో ఏ మార్పూ లేదు. ఈ సారైనా దానిని రూ.2.5 లక్షలకు పెంచాలని ఆశిస్తున్నారు.
2018లో స్టాండర్డ్ డిడక్షన్ విధానం అమల్లోకి వచ్చింది. రూ.40 వేల నుంచి ఇది ఆరంభమవుతుంది. 2019లో ఆ పరిమితిని రూ.50 వేలకు చేర్చారు. ఐదేళ్లుగా బడ్జెట్లు ప్రవేశపెడుతున్నా… దానిలో ఎలాంటి మార్పులూ చేయలేదు. ఈ సారైనా దానిని రూ.లక్షకు పెంచాలని అభ్యర్థన పలు వర్గాల నుంచి వస్తోంది. అలాగే సెక్షన్ 80 సీ, 80 డీ డిడక్షన్ ప్రయోజనాలను విస్తరించాలని కోరుకుంటున్నారు. ఎన్నికల అనంతరం కొత్తగా కొలువుదీరే ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను జూలైలో ప్రవేశపెడుతుంది.