rohit sharma in test cricket(Indian cricket news today)
విశాఖపట్నం అంటే చాలామంది క్రికెటర్లకి వల్లమాలిన ప్రేమ ఉంటుంది. నిజానికి మహేంద్ర సింగ్ ధోనీ ఆరంగ్రేటం తర్వాత వరుసగా విఫలమవుతా ఉంటే, విశాఖపట్నంలోనే తన జులపాల జుట్టుతో జూలు విదిల్చాడు. 2005లో పాకిస్తాన్ తో జరిగిన ఆ వన్డేలో ప్రమోషన్ పై ఫస్ట్ డౌన్ లో వచ్చాడు. 123 బాల్స్ లో 148 పరుగులు చేశాడు. ఇందులో 4 సిక్సర్లు , 15 ఫోర్లు ఉన్నాయి.
ఆ మ్యాచ్ లో టీమ్ ఇండియా 9 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. తర్వాత పాకిస్తాన్ లక్ష్య ఛేదనలో 298 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్ ధోనీ క్రికెట్ కెరీర్కి టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. మళ్లీ తను ఇప్పటి ఐపీఎల్ వరకు వెనక్కి తిరిగి చూడలేదు. అదీ వైజాగ్ కెపాసిటీ అని అందరూ అంటూ ఉంటారు.
ఇలాంటి వైజాగ్ కథలు చాలానే ఉన్నాయి. వాటిలో మరొకటి రోహిత్ శర్మకి సంబంధించినది.. అదేమిటంటే టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అమ్మమ్మ ఊరు విశాఖపట్నమే. రోహిత్ శర్మ తల్లి జన్మస్థలం ఇదే అనే సంగతి అందరికీ తెలిసిందే.
రోహిత్ శర్మ ఇన్నేళ్ల కెరీర్ లో విశాఖపట్నంలో ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అది కూడా 2019లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో రెండు ఇన్నింగ్సుల్లో కూడా సెంచరీలు చేయడం విశేషం. అయితే మొదటి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. 244 బంతులు ఆడి 6 సిక్స్ లు, 23 ఫోర్లతో 176 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలాగే సెకండ్ ఇన్నింగ్స్లో 7 సిక్సులు, 10 ఫోర్లతో 127 పరుగులు చేశాడు. ఐదు రోజులు జరిగిన మ్యాచ్ లో టీమ్ ఇండియా 203 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
అందువల్ల రోహిత్ శర్మ చేసిన సెంచరీలను అందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇంగ్లాండ్తో రెండో టెస్ట్ మ్యాచ్కి విశాఖపట్నం వేదిక కానుంది. అందుకే రోహిత్ శర్మ ఆనాటి మ్యాజిక్ మళ్లీ రిపీట్ చేయాలని, ఇంగ్లాండ్కి తగిన బుద్ధి చెప్పాలని అభిమానులు కోరుతున్నారు.