చిత్తూరు జిల్లా సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం టీడీపీ గూటికి చేరారు. మార్పులు చేర్పులంటున్న వైసీపీ తనను తిరుపతి ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించడంతో.. తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే మంత్రి పెద్దిరెడ్డిని టార్గెట్ చేస్తూ.. వైసీపీకి గుడ్బై చెప్పారు. అయితే ఇప్పటికే సత్యవేడు టీడీపీ ఇన్చార్జ్ ఉండటంతో.. ఆదిమూలం పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశంగా మారింది.. సత్యవేడుతో పాటు వివిధ నియోజకవర్గాల్లో సొంత బలం ఉండటం కోనేటికి కలిసివస్తుందా? పెద్దిరెడ్డిపై సంధించడానికి ఆయన రూపంలో టీడీపీకి మరో అస్త్రం దొరికిందా?
వైసీపీ మార్పులు చేర్పులంటూ నిర్వహిస్తున్న అభ్యర్ధుల షఫిలింగ్ ఆపరేషన్తో.. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒకొక్కరుగా ఆ పార్టీకి దూరమవుతున్నారు. తిరుపతి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆ ఎఫెక్ట్తోనే అధికారపక్షానికి గుడ్బై చెప్పేశారు. తిరుపతి ఎంపీ గురుమూర్తిని సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన వైసీపీ .. ఎమ్మెల్యే కోనేటిని తిరుపతి ఎంపీ స్థానానికి ఇన్చార్జ్గా షిఫ్ట్ చేసింది. ఆ ప్రకటన వెలువడినప్పుడు ఆయన సైలెంట్గా కనిపించారు.
నియోజకవర్గం మార్చిన తర్వాత కూడా ఆదిమూలం వెళ్లి పెద్దిరెడ్డిని కలసి అశ్శీస్సులు తీసుకున్నారు. తర్వాత పార్టీ సమన్వయ సమావేశానికి కొడుకును సైతం పంపించారు. సడన్గా ఏమైందో ఏమో కాని.. ఒక్కసారిగా రివర్స్ అయ్యారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డగా సత్యవేడు మారిపోయిందని విమర్శిస్తూ.. ఎస్పీ సామాజిక వర్గం ప్రజా ప్రతినిధులు అంటే వైసీపీ చులకనగా చూస్తుందని నిప్పులుకక్కారు. తర్వాత రోజుల వ్యవధిలోనే అమరావతి వెళ్లి ఆ తండ్రికొడుకులు లోకేష్ ఎదుట ప్రత్యక్షమయ్యారు.
సత్యవేడు విభిన్నమైన నియోజకవర్గం.. అక్కడ పకృతి వనరులు ఎక్కువ.. ఇసుక, గ్రావెల్ అక్రమదందాలకు అడ్డా లాంటిది. దాంతో పాటు పారిశ్రామిక వాడలు ఉన్నాయి. శ్రీసిటితో పాటు హీరో హోండా, అపోలో వంటి పరిశ్రమలు ఉన్నాయి. ఇలాంటి చోట ప్రజా ప్రతినిధి ఆదాయవనరులకు ఇబ్బంది ఉండదు. అయితే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కావడంతో పెత్తనం మంతా జిల్లా నేతల అనుచరులుగా ఉన్న ద్వీతీయ శ్రేణి నేతలదే జరుగుతుంటుంది.
అయితే టీడీపీ హయాంలో మాత్రం స్థానిక ఎమ్మెల్యే పెత్తనమే కొనసాగింది. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన తలారి అదిత్యపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినప్పటికీ టీడీపీ అధిష్టానం చూసీ చూడనట్లు పోయింది. అయితే వైసీపీలో ఆదిమూలం ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ.. పెద్దిరెడ్డి అనుచరుడు బీరేంద్రవర్మ సత్యవేడులో చక్రం తిప్పారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసమే బీరేంద్రవర్మ పెత్తనం భరిస్తున్నానని ఆదిమూలం సన్నిహితులతో చెప్పేవారంట.
ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా ఎంపి అభ్యర్థిగా ప్రకటించడం.. ఎంపీ అభ్యర్ధిని సైతం చివరి నిముషంలో మారుస్తారన్న ప్రచారంతో.. కోనేటి ఆదిమూలం ముందుజాగ్రత్తా తన దారి తాను చూసుకున్నారు. సత్యవేడు నియోజక వర్గంలో పట్టున్న టీడీసీ నేత, కాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు సహాకారంతో టీడీపీ పెద్దలను కలిశారు. దానికి ముందే స్థానిక టీడీపీలో ఉన్న విభేదాలను ఆయన తనకు అనుకులంగా మార్చుకునే ప్రయత్నం చేశారంట.
సత్యవేడు నియోజకవర్గంలోని టీడీపీ ఇన్చార్జ్ వ్యతిరేక గ్రూపులతో మీటింగ్ పెట్టి… తాను టీడీపీ టికెట్ తెచ్చుకుటే వారంతా సహకరించేలా ఒప్పించి.. పసుపు కండువా కప్పుకోవడానికి రెడీ అయ్యారంట ఆయన.. సత్యవేడు నియోజకవర్గ ఇన్చార్జ్ గా ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే హేమలత కూమార్తె డాక్టర్ హెలెన్ కొనసాగుతున్నారు. అయితే అమె తమిళనాడు వాసి అంటు పార్టీలో ఓ వర్గం ప్రచారం చేస్తుంది. దానికి తోడు అమెది మాదిగ సామాజిక వర్గం కావడంతో.. సత్యవేడులో గణనీయంగా ఉన్న తమిళ మాల సామాజికవర్గం ఓట్లు దూరమయ్యే పరిస్థితి ఉందని స్థానిక టీడీపీ నేతలే అంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఆదిమూలం లాంటి మాస్ లీడర్ టీడీపీకి అవసరమని హెలెన్ వ్యతిరేకవర్గాలు అధిష్టానానికి నివేదించాయంట. దానికి తోడు వైసీపీలోని ఓవర్గం సైతం ఆదిమూలంతో రావడానికి సిద్దం అయ్యిందంట. అలాగే తిరుపతి ఎంపీ స్థానం పరిధిలోకి వచ్చే జీడి నెల్లూరు, నగరి సెగ్మెంట్లలో కూడా ఆయనకు సొంత వర్గం ఉందంట. ఆ క్రమంలో ఆదిమూలం రాక.. టీడీపీకి ప్లస్ అవుతుందని పార్టీ పెద్దలు కూడా భావిస్తున్నారంట. మొత్తం మీద ఆదిమూలానికి టీడీపీలో అన్ని కలసి వచ్చే పరిస్థితే కనిపిస్తోంది. అందుకే ఆదిమూలం సత్యవేడు టీడీపీ అభ్యర్థి అయిన అశ్చర్యపోనవసరం లేదంటున్నారు సత్యవేడు నేతలు.
.
.