వైసీపీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇష్యూ మళ్లీ మొదటికొచ్చింది. ఒంగోలు పార్లమెంట్ సీటు మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఇవ్వాలని మాజీ మంత్రి బాలినేని పట్టుబడుతున్నారు. గుంట కి టిక్కెట్ ఇవ్వకపోతే ఆయన స్థానంలో తన కుమారుడికి ఒంగోలు ఎంపి టిక్కెట్ ఇవ్వాలని బాలినేని ప్రతిపాదించారు. అయితే ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. బాలినేని ప్రతిపాదనల్ని వైసీపీ పెద్దలు పట్టించుకోకపోవడంతో.. ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని పోటీపై మళ్లీ డౌట్లు మొదలయ్యాయి.
ప్రకాశం జిల్లా వైసీపీలో ముఖ్య నాయకుడిగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది .. ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి తాను తిరిగి పోటీ చెయ్యాలంటే.. ఒంగోలు ఎంపీ టికెట్ మాగుంట శ్రీనివాసులురెడ్డికే కేటాయించాలని బాలినేని పట్టుబట్టారు. అయితే మాగుంట శ్రీనివాసులురెడ్డికి కానీ, ఆయన కుమారుడు రాఘవరెడ్డికి కానీ ఒంగోలు నుండే కాకుండా ఎక్కడా వైసీపీ టిక్కెట్ కేటాయించే ప్రసక్తే లేదని తేల్చేశారు జగన్.
మాగుంట విషయంలో బాలినేని పంతం వీడకుండా ప్రయత్నాలు చేస్తున్నా.. వైసీపీ పెద్దలు పట్టించుకోవడమే మానేశారు. మాగుంట ఒంగోలు బరిలో లేకపోతే.. తాను కూడా ఒంగోలు వదిలేస్తానంటున్న బాలినేని.. అదే విషయమై తేల్చుకునేందుకు .. విజయవాడ వెళ్లి అక్కడి హోటల్లో మకాం వేశారు. బాలినేని ఉంటున్న హోటల్ కి వెళ్లిన వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి బాలినేనితో చర్చలు జరిపారంట.. చర్చల్లో బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా వైసీపీ అధిష్టానం షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
మాగుంటతో లింకు పెడుతున్న బాలినేని ఒంగోలు నుంచి పోటీ చేయకపోతే.. ఆయన స్థానంలో వై,వి.సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డిరి ఒంగోలు ఎమ్మెల్యే బరిలోకి, ఒంగోలు పార్లమెంట్ స్థానంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను పోటీలో దించడానికి జగన్ ఫిక్స్ అయ్యారని .. బాలినేని శ్రీనివాసరెడ్డి గిద్దలూరుకు షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుందని సజ్జల చెప్పారంట. జగన్ నిర్ణయాలతో బాలినేని శ్రీనివాసరెడ్డికి ఊహించని షాక్ తగిలిందంటున్నారు.
బావ-బావమరుదులైన బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవి సుబ్బారెడ్డి మధ్య గత పదేళ్ల నుండి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో తన స్థానంలో వైవి.సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డిని తెరపైకి తీసుకురావడం బాలినేనికి షాకింగ్ అంశంగా మారిందంట. దీంతో ఒంగోలు చేజారిపోతుందని బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ పెద్దల ముందు మరో ప్రతిపాదన పెట్టారంట. ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ మాగుంటని తప్పిస్తే.. ఆ స్థానంలో తన కుమారుడు ప్రణీత్ రెడ్డిని పోటీలో ఉంచాలని ప్రతిపాదించినట్టు తెలుస్తోంది.
ప్రణీత్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తే.. పార్లమెంట్ స్థానంలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల గెలుపు బాధ్యతలు తాను తీసుకుంటానని బాలినేని చెప్పినట్టు సమాచారం. అయితే బాలినేని ప్రతిపాదన విన్న సజ్జల.. జగన్ తో చర్చించి ఏ విషయం చెప్పానన్నారంట. ఎంపీ అభ్యర్ధిగా మాగుంట అయితే ఆర్దికంగా కలిసి వస్తుందని.. తన కుమారుడు అయితే లోకల్ సెంటిమెంట్తో ఒంగోలులో తన విజయానికి ఈజీ అవుతుందన్నది బాలినేని ఆలోచనని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. బయటి వ్యక్తులకు జిల్లాల్లో సీట్లు కేటాయిస్తే.. పార్టీని అంటిపెట్టుకొని ఉన్న జిల్లాల్లో ఉన్న నేతల పరిస్థితి ఏంటని? బాలినేని అంటున్నారంట.
2014, 2019 ప్రకాశం జల్లాల్లో వైసీపీ అభ్యర్థుల ఎంపిక బాలినేని కనుసన్నల్లోనే జరిగింది. అయితే ఇప్పుడు ఎదుర్కొంటున్న దుస్థితిని బాలినేని జీర్ణించుకోలేక పోతున్నారట. వైఎస్ మరణం తర్వాత మంత్రి పదవి వదులుకుని జగన్ వెంట నడిచిన నేత బాలినేని.. అటువంటి తనను జగన్ పట్టించుకోవటం లేదనీ బాలినేని ఇప్పుడు తెగ ఫీల్ అవుతున్నారంట.
అదలా ఉంటే ఇటీవల కాలంలో సొంత బంధువైనప్పటికీ బాలినేనికి జగన్ అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. దానికి చాలా కారణాలే ఉన్నాయంటున్నారు. వైవీ సుబ్బారెడ్డి వర్సెస్ బాలినేని కోల్డ్వార్కి సంబంధించి జగన్ తన బాబాయ్ అయిన వైవీ సుబ్బారెడ్డి మాటకే ప్రాధాన్యమిస్తుంటారు. ఇక తన షరతులకు ఒప్పుకోని మాగుంట శ్రీనివాసులురెడ్డి విషయంలో బాలినేని అంతలా పట్టుబట్టడం వైసీపీ అధ్యక్షుడికి అసలు నచ్చడం లేదంట.
అలాగే ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఒంగోలు పర్యటనలో బాలినేని శ్రీనివాసరెడ్డిని పలెత్తు మాట అనలేదు. షర్మిలకు బాలినేని టచ్లో ఉన్నారంటున్నారు. అది కూడా బాలినేనిపై జగన్ కోపానికి కారణమన్న వాదన వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బాలినేని ప్రతిపాదనలకి సీఎం జగన్ ఎంత వరకు ఓకే అంటారో చూడాలి.
.
.