Parliament Budget Sessions : నేడు రెండవ రోజు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సార్వత్రిక ఎన్నికల ముందు చివరి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. దేశ ప్రజల్లో నిర్మలమ్మ చెప్పే పద్దుల లెక్కలు ఎలా ఉండనున్నాయోనన్న ఉత్కంఠ నెలకొంది. పేదలు, మధ్య తరగతి ప్రజల ఆశలు నెరవేరేలా, వ్యాపార వర్గాలకు అనుకూలంగా ఈ బడ్జెట్ ఉండనుందన్న అంచనాలతో అంతా ఎదురు చూస్తున్న తరుణంలో మరికొన్ని గంటల్లోనే బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్.
భారీ అంచనాల నడుమ 2024-25కుగాను తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు నిర్మలమ్మ. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెడుతోంది కేంద్రం. ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. కాగా.. మోదీ రెండవసారి పాలనలో ఆఖరి పద్దను సభ ముందు ఉంచునున్నారు నిర్మలా సీతారామన్. ముచ్చటగా మూడోసారి అధికార పగ్గాలు చేజిక్కించుకునేందుకు అన్ని వర్గాల ప్రజలతోపాటు రైతులు, మహిళలను ప్రసన్నం చేసుకునేలా ఈ బడ్జెట్ రూపకల్పన జరిగిందన్న అంచనాలు ఉన్నాయి.
మోదీ సర్కార్ ప్రవేశపెడుతున్న ఈ ఆఖరి బడ్జెట్లో ప్రధానంగా అన్నదాతలకు పెద్దపీట వేసినట్టు తెలుస్తోంది. పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఏటా అందిస్తున్న పెట్టుబడి సాయం మొత్తాన్ని ఇప్పుడున్న 6 వేల రూపాయల నుంచి 9 వేలకు పెంచొచ్చన్న ప్రచారం జోరుగా సాగుతుండటంతో రైతన్నలు పద్దుల కోసం ఎదురుచూస్తున్నారు. మరోపక్క ఆయుష్మాన్ భారత్ కింద ప్రస్తుతం ఉన్న 5 లక్షల ఆరోగ్య బీమా కవరేజీని రెట్టింపు చేస్తూ 10 లక్షలకు పెంచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సూర్యోదయ యోజన కింద కోటి ఇళ్లపై రూఫ్టాప్ సోలార్ ప్యానళ్లను ఏర్పాటుచేయాలన్న యోచనలో ఉంది కేంద్రం. ఇందుకోసం రాయితీలను పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మౌలిక వసతుల కల్పన, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఇందులో కీలక ప్రకటన చేసే అవకాశముందని కూడా సమాచారం. మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు ఉండటంతో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే ఈసారి నిర్మలమ్మ ప్రవేశపెట్టే ఓట్ ఆన్ బడ్జెట్తో ఆర్థిక మంత్రిగా ఆమె సరికొత్త రికార్డ్లను సృష్టించనున్నారు. ఇవాళ వరుసగా ఆరవసారి పద్దులను ప్రవేశపెట్టడంతో 2019 జూలై నుంచి వరుసగా ఐదు సంవత్సరాలు దేశానికి పూర్తి స్థాయి బడ్జెట్ను అందించిన మహిళా ఆర్థికమంత్రిగా నిర్మలా రికార్డ్లోకి ఎక్కనున్నారు. అలాగే మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డ్ను సమం చేయనున్నారు నిర్మల. మొరార్జీ దేశాయ్ ఆర్థిక మంత్రిగా 1959–1964 మధ్య ఐదు వార్షిక బడ్జెట్లు, ఒక మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. వరుసగా ఐదు బడ్జెట్లు సమర్పించిన ఆర్థిక మంత్రుల జాబితాలో గతంలో మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, చిదంబరం, యశ్వంత్ సిన్హా ఉండగా ఆరో బడ్జెట్తో కొత్త రికార్డును క్రియేట్ చేయనున్నారు నిర్మలా సీతారామన్.