TSRTC : టీఎస్ఆర్టీసీ (TSRTC) సిబ్బందిపై దాడులకు పాల్పడితే.. ఎవరినైనా ఉపేక్షించబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని సంస్థ హెచ్చరించింది. నిబద్ధత, క్రమశిక్షణతో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తోన్న సిబ్బందిపై కొందరు అనుచితంగా దాడులకు పాల్పడటాన్ని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రతిరోజూ సగటున 55 లక్షల మంది ప్రయాణికులను బస్సుల ద్వారా క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తోన్న సిబ్బందిపై.. అసభ్యపదజాలంతో దుర్భాషలాడుతూ దాడులు చేయడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇది ఏమాత్రం సమంజసం కాదని పేర్కొంది.
టీఎస్ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించి, దాడులకు పాల్పడే వ్యక్తులపై .. పోలీస్ శాఖ సహకారంతో నేరస్థులపై హిస్టరీ షీట్స్ తెరిచేలా చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించింది. సిబ్బందిలో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఏ మాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేసింది టీఎస్ఆర్టీసీ.
టీఎస్ఆర్టీసీ కండక్టర్లపై ఇటీవల కాలంలో 3 చోట్ల మహిళలు దాడులకు పాల్పడ్డారని పేర్కొంది. హయత్ నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై నానా దుర్భాషలాడుతూ వేర్వేరుగా దాడికి దిగారు. గుర్తింపు కార్డు చూపించి జీరో టికెట్ తీసుకోవాలని కండక్టర్ చెప్పినందుకు.. మరో మహిళ సెల్ఫోన్ లాక్కొని దుర్భాషలాడింది. పికెట్ డిపోకు చెందిన మహిళా కండక్టర్ పై యాదగిరిగుట్టలో కొందరు మహిళలు సామూహికంగా దాడిచేశారు. ఈ మూడు ఘటనలపై రాచకొండ కమిషనరేట్ లో ఉన్న సంబంధిత పీఎస్ లలో టీఎస్ఆర్టీసీ అధికారులు వేరర్వేరుగా ఫిర్యాదు చేశారని, ఆయా మహిళలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని టీఎస్ఆర్టీసీ తెలిపింది.
మహాలక్ష్మిపథకం కింద బస్సులో ఫ్రీ జర్నీ చేసేవారు ఖచ్చితంగా ఒరిజినల్ గుర్తింపు కార్డును వెంటపెట్టుకుని వెళ్లాలని మరోసారి టీఎస్ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. ఫొటోకాపీలు, స్మార్ట్ ఫోన్లలో గుర్తింపు కార్డులు చూపించిన వారికి జీరో టికెట్ ఇవ్వరని తెలిపింది. ప్రయాణికులు తమ ఫిర్యాదులు, సమస్యలను సంస్థ దృష్టికి తీసుకొచ్చేందుకు కేంద్ర కార్యాలయం బస్ భవన్లో పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసింది. 24 గంటల పాటు అందుబాటులో ఉండే టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లైన 040-69440000, 040-23450033 ఫోన్ చేసి సమస్యలను చెప్పొచ్చు. లేదా సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులను సంస్థ దృష్టికి తీసుకెళ్లొచ్చు. ఫిర్యాదుపై సంస్థ అధికారులు చర్యలు తీసుకుంటారు. అంతేకానీ.. సిబ్బందిపై దాడులకు పాల్పడటం సరైంది కాదని టీఎఆర్టీసీ అభిప్రాయపడింది.