Tollywood: ఒకప్పుడు పెద్ద సినిమాలు అధికారికంగా తమ రిలీజ్ డేట్లను ప్రకటిస్తే.. ఆ తేదీల బట్టి మిగతా సినిమాలు తమ డేట్లను ఫిక్స్ చేసుకునేవి. కానీ ఇప్పుడంతా మారిపోయింది. టాలీవుడ్లో ఇప్పుడు రిలీజ్ డేట్ల విషయంలో కొత్త ట్రెండ్ మొదలైంది. వేరే హీరోల సినిమా రిలీజ్ డేట్లపై ఫోకస్ పెట్టడమే ఇప్పుడి ట్రెండ్.
ముందుగా ఒక పెద్ద సినిమా రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించి.. ఆతర్వాత ఆ డేట్ పోస్ట్ పోన్ అవుతుందని వార్తలు రావడం.. దీంతో అదే రిలీజ్ డేట్పై మరో సినిమా కర్చీఫ్ వేయడం జరుగుతుంది. ఇదే ఈ ట్రెండ్ పాలసీ. ఇప్పుడు టాలీవుడ్ అంతా ఇదే సందడి.
దేవర, పుష్ప2 వంటి సినిమాలు వాయిదా పడే అవకాశం ఉండొచ్చని వస్తున్న వార్తలతో.. మరో రెండు సినిమాలు అదే విడుదల తేదీని టార్గెట్ చేస్తున్నాయి. అయితే ముందుగా ఈ ట్రెండ్ను సెట్ చేసింది టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు.
ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న ‘దేవర’ను ఈ ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల బట్టి ఈ మూవీ వాయిదా పడే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ తరుణంలోనే దేవర మూవీ పోస్ట్ పోన్ అయితే అదే రోజున ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ చేస్తామని తాజాగా జరిగిన ప్రెస్ మీట్లో దిల్ రాజు చెప్పారు.
ఇక ఇదే ట్రెండ్ను నేచురల్ స్టార్ నాని కూడా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న ‘పుష్ప2’ భారీ రేంజ్లో తెరకెక్కుతోంది. ముందుగా ఈ చిత్రాన్ని ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే ఈ మూవీ కూడా చాలా వరకు వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నాని నటిస్తోన్న ‘సరిపోదా శనివారం’ టీం ‘పుష్ప2’ రిలీజ్ డేట్పై కన్నేసింది. ఒకవేళ ‘పుష్ప2’ మూవీ ఏదైనా కారణం చేత రిలీజ్ కాకపోతే.. ఆ రిలీజ్ డేట్ తమదేనంటూ ముందుగానే అలెర్ట్ చేసేస్తున్నారు. ఈ బాటలోనే మరికొంతమంది వెళుతున్నట్లు తెలుస్తోంది.