Lord Nandi : ఏ శివాలయంలో అడుగుపెట్టినా.. ముందుగా మనకు కనిపించేది ఆయన వాహనమైన నందీశ్వరుడు. తన స్వామిని కన్ను ఆర్పకుండా, నిండైన భక్తితో నందీశ్వరుడు దర్శనమిస్తాడు. కైలాసంలోని ప్రమథ గణాల్లోనూ ఈయనదే అగ్రస్థానం. త్రిమూర్తులైనా సరే… నందీశ్వరుడి అనుమతి లేనిదే శివ దర్శనం చేసుకోలేరు. లోకంలో ఎందరో శివభక్తులు ఉండగా, కేవలం నందీశ్వరుడికే ఈ స్థానం ఎలా దక్కింది? అని తెలుసుకోవాలంటే ముందుగా అసలు నందీశ్వరుడు ఎవరు? అతని కథ ఏమిటో తెలుసుకోవాలి.
పూర్వం శిలాదుడు అనే ముని ఉండేవాడు. ఈ శిలాదుడికి వివాహమై ఎన్నాళ్లైనా సంతానం కలగలేదు. ఎన్నో పూజలు, వ్రతాలు చేసినా ఫలితం లభించకపోవటంతో హిమాలయాలకు వెళ్లి శివుని గురించి ఘోర తపస్సు చేయటం ప్రారంభించాడు. ఏళ్ల తరబడి తపస్సులో ఉండిపోయిన ఆయన చుట్టూ పుట్టలు పెరిగిగా తపస్సు ఆపలేదు. దీంతో సంతోషించిన శివుడు ప్రత్యక్షమవగా, తన వంశాన్ని నిలిపేందుకు అయోనిజుడైన (తల్లి గర్భాన పుట్టని) ఒక కుమారుని ప్రసాదించమని, అతడు గొప్ప పండితుడు, వేదాంతి, గుణ సంపన్నుడు, శివభక్తుడు, దీర్ఘాయువు కలిగిన వాడుగా ఉండాలని కోరాడు.
అయితే.. ‘నువ్వు కోరిన గుణాలున్న కుమారుడిని నువ్వు పొందుతావు గానీ.. ఆ బాలుడు అల్పాయుష్కుడవుతాడు’ అని పరమశివుడు చెప్పగా.. శిలాదుడు సరేనన్నాడు. తిరిగి ఆశ్రమానికి వచ్చి చాలాకాలమైనా శివుని వర ప్రభావం కనిపించలేదు. దీంతో సంతానయాగం చేసేందుకు ఒక యజ్ఞకుండాన్ని తవ్వటం ప్రారంభించగా, అందులో ఒక తేజోవంతుడైన బాలుడు కనిపించాడు.
ఆ అందమైన, మంచి శరీర సౌష్టవము గల ఆ బాలుడిని ఆ ముని దంపతులు అల్లారుముద్దుగా పెంచుతున్నారు. కొన్నాళ్లకు నామకరణం చేయాలని భావించగా, అశరీరవాణి ‘ఈ బాలుడు మీకే కాదు, పార్వతీపరమేశ్వరులకూ ఆనందం కలిగిస్తాడు. కనుక ‘నందుడు’ అని పిలవండి కలుగచేస్తాడు. కాబట్టి ఇతడిని నందుడు అని పిలవమని చెబుతుంది. నాటి నుంచి నందుడిగా పిలవటం మొదలుపెట్టారు. ఉపనయనం తర్వాత గురుకులానికి వెళ్లిన ఆ బాలుడు తన అసాధారణ ప్రజ్ఞతో అతి తక్కువ సమయంలోనే అన్ని విద్యలూ నేర్చుకున్నాడు.
ఒక రోజున శిలాద దంపతులు తమ కుటీరంలో నందుని దగ్గర కూర్చోబెట్టుకుని ఉండగా, సూర్యుడు, వరుణుడు వచ్చారు. వారికి గొప్ప అతిథి మర్యాదలు చేసిని నందిని సంతోషంతో వారు ‘దీర్ఘాయుష్మాన్ భవ’ అని ఆశీర్వదించబోతూ.. ఒక్క క్షణం ఆగిపోతారు. దీనికి కారణం ఏమిటని శిలాదుడు అడగగా ‘త్వరలోనే బాలుని ఆయుష్షు తీరబోతోంది’ అని చెబుతారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు కాగా.. శివానుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యమే. కనుక నన్ను తపస్సుకు పంపండని కోరి కేదారనాథ్లోని తపోవనానికి వెళ్ళి తపస్సు చేస్తాడు నందుడు.
నందుడి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా, ఎప్పుడూ నీ దగ్గరే ఉండి,సేవచేసుకుంటానని కోరగా, సంతసించిన ఆది దంపతులు.. ‘దీర్ఘాయుష్మంతుడవై మాతోనే ఉండిపో’ అని వరమిస్తాడు. నందుని సేవలకు మెచ్చిన ఆదిదంపతులు.. నందీశ్వరుడిని ప్రమథ గణాల్లో ప్రధముడిగా నియమించటమే గాక ‘సుకీర్తి’ అనే కన్యతో నందీశ్వరుడికి వివాహం చేశారు. ఆ సంతోష సమయంలో శివుడు నందీశ్వరుడితో ‘నేటి నుంచి నీవు నా మంత్రివి, సేవకుడివి, వాహనానివి, ముల్లోకాలను జయించే పరాక్రముడిగా ఉంటావు. నీ పూర్వీకుల్లో 5 తరాల వారు నా రుద్రగణాల్లో చేరతారు’ అని వరమిచ్చాడు. నాటి నుంచి రుద్రుని వాహనంగా నందీశ్వరుడు సేవలందిస్తున్నాడు.