నిజామాబాద్ జిల్లాలో రైస్ మిల్లులపై అధికారులు ఉక్కుపాదం మోపారు. కస్టమ్ మిల్లింగ్ ధాన్యం దుర్వినియోగం అయిందన్న ఆరోపణలపై రేవంత్ రెడ్డి సర్కార్ సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే తనిఖీలకు ఆదేశించింది. దీంతో జిల్లాలోని పలు రైస్ మిల్లుల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. 9 మిల్లుల యజమానులు ధాన్యం అమ్మేసినట్టు గుర్తించారు.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 52 కోట్ల విలువైన 2.44 లక్షల క్వింటాళ్ల ధాన్యం పక్కదారి పట్టినట్టు అధికారులు గుర్తించారు. ఖరీప్ లో 4 శాతం, రబీలో 60 శాతానికి పైగా కస్టమ్ మిల్లింగ్ ధాన్యం బకాయిలు పడ్డ మిల్లర్ యజమానులపై చర్యలకు సర్కార్ ఆదేశించింది. ఈ క్రమంలోనే 9 మిల్లుల యాజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. రెవెన్యూ రికవరీ చట్టం కింద నోటీసులు జారీ చేసింది. 9 రైస్ మిల్లుల యజమానుల ఆస్తుల జప్తునకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో నోటీసులు ఇచ్చింది.
రైస్ మిల్లుల్లో ధాన్యం కుంభకోణం జరిగిందని రైత సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు .ఇదే విషయంపై గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేస్తూ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.