కుమారి ఆంటీ. ఇప్పుడు ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కేవలం నాలుగంటే నాలుగు రోజుల్లోనే.. తెలుగు రాష్ట్రాల్లో ఈమె పేరు మోతమ్రోగిపోయింది. సోషల్ మీడియా ఓపెన్ చేసి చూస్తే.. ఈమె పైనే రీల్స్, మీమ్స్ కనిపిస్తున్నాయి. ఈమె చేసే ఫుడ్ బిజినెస్, దానికి వచ్చే ఇన్ కమ్, నెలకు మిగిలే ఆదాయం వివరాలు విన్నవారంతా.. కళ్లు తేలేశారంటే అతిశయోక్తి కాదు. రోజుకి రూ.60 వేలు, నెలకు రూ.18 లక్షలు. ఖర్చులన్నీపోనూ నెలకు తక్కువలో తక్కువ.. రూ.6 లక్షల వరకూ ఆదాయం. ఇంకేముంది.. మేం ఉద్యోగాలు మానేసి ఫుడ్ బిజినెస్ చేసుకుంటామంటూ.. పోలోమంటూ మీమ్స్ వచ్చేశాయి. చివరికి పోలీసులు ట్రాఫిక్ జామ్ పేరుతో.. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ను మూయించారు. మంగళవారం కుమారిని ఫుడ్ పెట్టనివ్వలేదు.
తాజాగా ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారంటూ నెట్టింట ఒక ట్వీట్ వైరల్ అవుతోంది. కుమారి ఫుడ్ స్టాల్ యథావిధిగానే ఉంటుందని, ఫుడ్ స్టాల్ మూసివేయాలని ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి డీజీపీని ఆదేశించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. త్వరలోనే సీఎం ఆమె ఫుడ్ స్టాల్ ను సందర్శిస్తారని సమాచారం. ఆమె ఎప్పుడూ ఉండే ప్లేస్ లోనే ఫుడ్ స్టాల్ ను కొనసాగిస్తుందని, పోలీసులు ఎలాంటి ఆటంకాలను కలిగించరాదని సీఎం ఆదేశాల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ ను నియంత్రించడంలో పోలీసులే విఫలమవుతున్నారని ప్రజల నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా పాలన అంటే.. ప్రభుత్వం చిరు, నూతన వ్యాపారస్తులను ప్రోత్సహించడమని, వారి కడుపు కొట్టడం కాదని సీఎం స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ పేదల పక్షపాతి అని మరోసారి సీఎం రేవంత్ నిరూపించారని.. నెటిజన్లు కొనియాడుతున్నారు.