పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అనేక కేసులు ఆయనను వెన్నాడుతున్నాయి. తోషఖానా కేసులో పాక్ మాజీ పీఎంకు 14 ఏళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది. ఇమ్రాన్ భార్య బుష్రా బీబీకి కూడా శిక్ష పడిందని ఆ దేశ మీడియా ప్రకటించింది. అంతుకు మరో కేసులోనూ ఆయనకు జైలు శిక్ష పడింది. అధికారిక రహస్య పత్రాల దుర్వినియోగం కేసులో ఇమ్రాన్ ఖాన్ కు కోర్టు పదేళ్ల శిక్ష విధించింది.
ప్రధాని మంత్రి ఉన్న సమయంలో వచ్చిన బహుమానాలను విక్రయించారని ఇమ్రాన్ ఖాన్ పై ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంలో గతంలోనే కేసు నమోదైంది. ఆ తర్వాత కోర్టులో విచారణ జరిగింది. సుధీర్ఘ వాదనల తర్వాత ఇమ్రాన్ ఖాన్ కు కోర్టు 14 ఏళ్ల జైలు శిక్షను విధించింది.
పాకిస్థాన్ చెందిన నాయకులు ఉన్నత పదవుల్లో ఉండగా విదేశాల నుంచి అందుకున్న బహుమానాల విషయంలో నిబంధనలున్నాయి. సదరు నేత పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఆ బహుమానాలను తోషఖానాలో జమ చేయాలి. లేకపోతే సగం రేట్ చెల్లించి ఆ కానుకులను సొంతం చేసుకునే అవకాశం కూడా ఉంది.
కానీ ఇమ్రాన్ ఖాన్ చాలా తక్కువ నగదు చెల్లించి ఆ బహుమానాలను తన వద్దే ఉంచుకున్నారనేది ప్రధాన అభియోగం. మరికొన్ని కానుకలను తోషఖానాకు తెలియకుండా విదేశాల్లోనే అమ్ముకున్నారని ఆరోపణలున్నాయి. మొత్తం 11.9 కోట్ల పాకిస్థానీ రూపాయల విలువైన బహుమానాలను చాలా తక్కువ మొత్తంలో చెల్లించి సొంతం చేసుకున్నారని ఇమ్రాన్ ఆరోపణలు ఎదుర్కొన్నారు.
ఫిబ్రవరి 8న పాకిస్థాన్ ఎన్నికలు జరగున్నాయి. ఇలాంటి సమయంలో ఇమ్రాన్ ఖాన్ వరుసగా శిక్షలు పడటం ఆయన పార్టీ కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు మొత్తం 150 కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది. మరి ఇమ్రాన్ ఖాన్ ఈ కేసుల నుంచి ఎలా బయటపడతారనేది ఆసక్తికరంగా మారింది.