పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణలో కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఎంపీ అభ్యర్థుల ఎంపిక కసరత్తును షురూ చేసింది. బుధవారం నుంచి ఫిబ్రవరి 3 వరకు ఆశావహుల నుంచి అప్లికేషన్లను స్వీకరించనుంది. ఇందుకోసం గాంధీభవన్లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసింది.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజును 25 వేలుగా నిర్ణయించింది. మిగిలిన అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 50 వేలు. ఈ మొత్తాన్ని డీడీ ద్వారా చెల్లించాలని సూచించింది. అప్లికేషన్ ఫామ్స్ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. ఈ విషయాన్ని గాంధీభవన్ సిబ్బంది ప్రకటించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ ఇదే విధానాన్ని అవలంభించింది. టిక్కెట్ ఆశిస్తున్న నేతల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఆశావాహుల పేర్లను వడపోసి తుది జాబితా సిద్ధం చేసింది. ఇప్పుడు లోక్ సభ అభ్యర్థుల ఎంపికకు ఇదే సూత్రాన్ని పాటిస్తోంది.
తెలంగాణలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ కు ఎంపీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. రాష్ట్రంలో మొత్తం 17 లోక్ సభ స్థానాలున్నాయి. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు స్థానాల్లో గెలిచింది. ప్రస్తుత సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి అప్పుడు మల్కాజ్ గిరి నుంచి విజయభేరి మోగించారు. నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచారు. భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ 9 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీకి నాలుగు సీట్లు దక్కగా.. ఎంఐఎం ఒక చోట గెలిచింది.
ఈసారి ఎన్నికల్లో కనీసం 13 స్థానాలు గెలవాలని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ పెట్టుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధపెట్టారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటీ అమలు చేస్తున్నారు. ఇప్పటికే రెండు గ్యారంటీలను అమల్లోకి తీసుకొచ్చారు. మిగిలిన నాలుగు గ్యారంటీలను అమలు చేసి ప్రజల మద్దతు పొందేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.