Parliament Budget Sessions (telugu news headlines today) : 17వ లోక్ సభ చివరి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గుర్రపు బగ్గీలో నూతన పార్లమెంట్ భవనానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. బడ్జెట్ సమావేశాలను తన ప్రసంగంతో ప్రారంభించారు. ఉభయ సభలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. కొత్త పార్లమెంట్ భవనంలో ఇది తన తొలి ప్రసంగమని రాష్ట్రపతతి తెలిపారు. అనంతరం ఎన్డీఏ సర్కారు నిర్వహించిన పనులను ఆమె వివరించారు. ప్రపంచ దేశాలకు ఎన్ని సమస్యలున్నా భారత్ మాత్రం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందన్నారు. భారతదేశ సంస్కృతి, సభ్యత ఎంతో గొప్పదని పేర్కొన్నారు.
ఆసియా క్రీడల్లో తొలిసారి 100 పతకాలు సాధించామని రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు. చంద్రుడి దక్షిణ ధృవంపై తొలిసారి అడుగుపెట్టింది మనమేనని గుర్తుచేశారు. అలాగే మన శాంతినికేతన్ హెరిటేజ్ వరల్డ్ లిస్టులో నిలిచిందని, ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిందని తెలిపారు. ముంబై అటల్ సేతు నిర్మాణం పూర్తి చేశామని, తెలంగాణలో సమ్మక్క సారక్క గిరిజన వర్సిటీని నిర్మించామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. జీ -20 సమావేశాలు విజయవంతమయ్యాయి. దేశంలో 5జీ నెట్ వర్క్ వేగంగా విస్తరిస్తోంది. ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్ మన లక్ష్యమని.. వికసిత భారతాన్ని నిర్మిస్తామని ఆమె పేర్కొన్నారు.
మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర భారత్ మన బలంగా నిలిచాయని రాష్ట్రపతి తెలిపారు. రామమందిర నిర్మాణానికి ఎన్నో ఏళ్లుగా ఆటంకాలుండగా.. వాటన్నింటినీ అధిగమించి అయోధ్యలో రామాలయాన్ని నిర్మించుకున్నామన్నారు. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో పాటు, ట్రిపుల్ తలాక్ కు ఉన్న అడ్డు కూడా తొలగిపోయిందన్నారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగిందన్నారు. జీఎస్టీ అమలుతో ఒకే ట్యాక్స్ చెల్లింపు విధానం అమల్లోకి వచ్చిందన్నారు.
భారత్ ఒకప్పుడు బొమ్మలను దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండేది కానీ.. ఇప్పుడు మనకు కావలసినవి మనమే తయారు చేసుకుంటున్నామని, అభివృద్ధి అంటే ఇదేనన్నారు. భారత వైమానిక దళం మరింత శక్తిమంతమైనదిగా ఎదిగిందన్నారు. అలాగే MSMEలను మరింత పటిష్టం చేసినట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. ఈ ప్రభుత్వ హయాంలో దేశంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని చెప్పుకొచ్చారు.
“దేశంలో తొలిసారి వందే భారత్, నమో భారత్ రైళ్లను ప్రారంభించాం. నాలుగు లేన్ల రహదారుల నిర్మాణం నాలుగు వంతులు పెరిగింది. ఆదిత్య ఎల్ 1 మిషన్ ను దిగ్విజయంగా ప్రయోగించాం. 2 లక్షల అమృత్ వాటికలను నిర్మించాం. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించి.. భారత నారీశక్తిని ప్రపంచానికి చాటిచెప్పాం. దేశంలో బ్రాడ్ బాండ్ వినియోగం సంఖ్య 14 రెట్లు పెరిగింది. కొత్త క్రిమినల్ చట్టాలను తీసుకొచ్చాం. రక్షణ, అంతరిక్ష రంగాల్లో కొత్త ఆవిష్కరణలు జరిగాయి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా భారత ఎకానమీ అభివృద్ధి చెందింది. డిజిటల్ మీడియా సెక్యూరిటీని మరింత పటిష్టం చేశాం. యువతకు లక్షల్లో ఉద్యోగాలను కల్పించాం.” అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు.
“రైల్వే శాఖలో వివిధ మార్పులతో ప్రయాణికులకు మెరుగైన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాం. విద్యుదీకరణ, వందేభారత్ రైళ్ల ప్రారంభంతో ప్రయాణికుల రాకపోకలు మరింత వేగమయ్యాయి. దేశవ్యాప్తంగా 39 వందేభారత్ రైళ్లను నడుపుతున్నాం. 1300 రైల్వే స్టేషన్లను ఆధునీకరించాం. 20 మెట్రో నగరాల్లో మెట్రో రైళ్ల వ్యవస్థ ఉంది. 11 కోట్ల ఇళ్లకు పైప్ లైన్ల ద్వారా మంచినీరు అందుతోంది. మేకిన్ ఇండియా నినాదంతో ముందుకెళ్తూ.. ఇప్పటికి లక్షకు పైగా స్టార్టప్ లను ఏర్పాటు చేసుకున్నాం. దేశంలో 10 లక్షల కిలోమీటర్లు గ్యాస్ పైప్ లైన్లను ఏర్పాటు చేసుకున్నాం. దేశంలో 1.4 కోట్ల మంది జీఎస్టీ కడుతున్నారు. గ్లోబల్ డిజిటల్ పేమెంట్స్ లో 46 శాతం భారత్ దే. గడిచిన పదేళ్లలో ద్రవ్యోల్బణం 5 శాతం కంటే తక్కువే. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో దేశంలో పెట్టుబడులు పెరిగాయి. 25 కోట్ల మంది ప్రజల్ని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం. DBT కింద రూ.25 లక్షల కోట్లను ప్రజలకు అందించాం. రూ. 7 లక్షల వరకూ ఆదాయ పన్ను చెల్లింపు నుంచి ఉపశమనం కల్పించాం. కరోనా సమయం నుంచి 80 కోట్లమంది ప్రజలకు ఉచిత రేషన్ అందించాం. కలగానే ఉన్న గరీబీ హఠావో నినాదాన్ని సుసాధ్యం చేశాం. పేదల కోసం 10 కోట్ల ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం.” అని రాష్ట్రపతి వివరించారు.