శుభ్ మన్ గిల్ ఓపెనర్ గా అద్భుతాలు స్రష్టించాడు. కానీ ఆస్ట్రేలియాతో జరిగిన 5 టీ ట్వంటీ మ్యాచ్ ల సిరీస్ తో ఇద్దరు ఓపెనర్లు జట్టుకి అందుబాటులోకి వచ్చారు. వారిలో ఒకరు యశస్వి జైశ్వాల్, మరొకరు రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరూ బాగా ఆడటంతో ఓపెనర్ గిల్ ప్లేస్ కి ఎసరు వచ్చింది. అంతవరకు బ్రహ్మాండమైన ట్రాక్ ఉన్న గిల్, సరిగ్గా ఫస్ట్ డౌన్ వచ్చిన దగ్గర నుంచి ఇబ్బంది పడుతున్నాడు.
శుభ్ మన్ గిల్ ఓపెనర్ ఫాస్ట్ బౌలర్లను బాగా ఎదుర్కొంటాడు. అలా ఓపెనర్ గా వెళ్లిన తర్వాత పిచ్ మీద కుదురుకున్నాక, అప్పుడు స్పిన్ బౌలర్లు వచ్చినా సరే, సమర్థవంతంగా ఎదుర్కొనేవాడు. భారీ స్కోరు దిశగా ముందుకు వెళ్లేవాడు. ఇప్పుడు ఫస్ట్ డౌన్ లో వచ్చిన తర్వాత 5 టెస్టుల్లో కేవలం 147 పరుగులే చేశాడు. అయితే శుభ్ మన్ గిల్ తన టెస్టు కెరియర్ ను ఓపెనర్ గా మొదలు పెట్టాడు. అలా బ్యాటింగ్ కు దిగిన గిల్ 16 టెస్టుల్లో 871 పరుగులతో 32.37 సగటు నమోదు చేశాడు.
టెస్టుజట్టులోకి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ చేరికతో గిల్ వన్ డౌన్ లో రావాల్సి వస్తోంది. అయితే..వన్ డౌన్ స్థానం గిల్ కు పెద్దగా అచ్చివచ్చినట్లు కనిపించడం లేదు. వరుస వైఫల్యాలతో తాను ఉక్కిరిబిక్కిరవుతూ టీమ్ మేనేజ్ మెంట్ సహనానికే పరీక్షగా నిలిచాడు.
ఇప్పుడు పరిస్థితెలా వచ్చిందంటే గిల్ ని కాపాడాలంటే, ఓపెనర్ గా రోహిత్ శర్మ త్యాగం చేయాల్సి ఉంటుంది. తను ఫస్ట్ డౌన్ లో వచ్చి గిల్ ని ఓపెనర్ గా పంపించి చూడాలి. ఇప్పుడైనా సక్సెస్ అవుతాడా? లేదంటే వైట్ బాల్ క్రికెట్ కే పరిమితమా? లేక రెడ్ బాల్ క్రికెట్ కి పనికి రాడా? అనే విషయం తేలిపోతుంది. జట్టు అవసరాల రీత్యా మరి రోహిత్ శర్మ త్యాగానికి ఒప్పుకుంటాడా? లేదా? అనేది ఈ మ్యాచ్ లో తేలిపోతుంది.
అదే మహేంద్ర సింగ్ ధోనీ అయి ఉంటే, తప్పకుండా తను చోటు మార్చుకునేవాడు, మార్చేవాడు, కానీ ఇక్కడ రోహిత్ శర్మ అలాంటి పాత్ర పోషిస్తాడా? లేదా? అనేది సందేహంగా ఉంది.
శుభ్ మన్ గిల్ వైఫల్యాలపై పలువురు సీనియర్లు సూచనలు చేస్తున్నారు. టీమ్ ఇండియా మాజీ లెజండరీ క్రికెటర్ అనిల్ కుంబ్లే కొన్ని సూచనలు గిల్ కి చేశాడు. శుభ్ మన్ గిల్ ప్రతిభకు లోటు లేదని, అతను మూడో స్థానంలో వచ్చినప్పుడు స్పిన్నర్లను ఎదుర్కునేలా టెక్నిక్ ను మార్చుకోవాలని అన్నాడు.