కృత్రిమ మేథస్సు మనిషికి ఎంత లాభమో.. దానితో అంతే నష్టం కూడా ఉన్నట్లు ఎలన్ మస్క్ పలుమార్లు చెప్పారు. ఏఐతో మనిషి మెదణ్ని హైక్ చేయొచ్చని కూడా వెల్లడించారు. అయితే, మస్క్ కంపెనీ న్యూరాలింక్ చేస్తున్న ప్రయోగాలతో అలాంటి నష్టం ఏమైనా రాబోతుందా..? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఎంత జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది..? ఇలాంటి ప్రయోగాల వల్ల ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది..?
మస్క్ కంపెనీ న్యూరాలింక్ మొదటి దశలో మరో రెండు అప్లికేషన్లు తెస్తున్నట్లు గతంలో ప్రకటించింది. ఇందులో.. అంధులుగా జన్మించిన వ్యక్తులకు కూడా చూపును పునరుద్ధరించడానికి లక్ష్యంగా పెట్టుకున్నది ఒకటి కాగా.. మరో అప్లికేషన్.. మోటారు కార్టెక్స్పై దృష్టి పెడుతుందని, వెన్నెముక తెగిపోయిన వ్యక్తులకు “పూర్తి శరీర కార్యాచరణను” పునరుద్ధరిస్తుందని తెలిపారు. దీని కోసం, మస్క్ తన పదిలక్షల డాలర్ల వ్యక్తిగత సంపదను కంపెనీలో పెట్టుబడి పెట్టాడు. అయితే, ఎలాంటి ఆధారాలు లేక ముందే.. న్యూరాలింక్ తయారుచేసే పరికరాలు “అతీంద్రియ జ్ఞానాన్ని” ఎనేబుల్ చేయగలవని చెప్పాడు. పక్షవాతానికి గురైన వ్యక్తులు ఏదో ఒక రోజు వారి ఆలోచనలతో స్మార్ట్ఫోన్లు లేదా రోబోటిక్ అవయవాలను ఆపరేట్ చేయగలరనీ.. వీటితో ఆటిజం, స్కిజోఫ్రెనియాను వంటి వ్యాధులకు పరిష్కారం ఉంటుందని అన్నారు.
ఇక, న్యూరాలింక్ పనితనంపై మస్క్ ఆలోచనలు సదరు ఫీల్డ్లోని చాలా మంది శాస్త్రవేత్తల కంటే మించిపోయాయనే విమర్శలను ఎదుర్కున్నారు. మానవ సహజ సామర్థ్యం కోల్పోయిన చోట దాన్ని పునరుద్ధరించడమే కాకుండా కొత్తగా సామర్థ్యాన్ని మెరుగుపరచడం లేదంటే, కొత్త బలాన్ని జోడించడం కూడా సాధ్యమవుతుందని అన్నారు. అయితే, మానవ సామర్థ్యాలను పెంచడానికి న్యూరోటెక్నాలజీని ఉపయోగించడం పునరుద్ధరించడం కంటే చాలా ముఖ్యమైన నైతిక ప్రశ్నలను లేవనెత్తుతుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా, ఇది ఆరోగ్యవంతమైన వ్యక్తులపై ఉపయోగిస్తే, విభిన్నమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. నిజానికి, ఇటువంటి లక్ష్యాలు ఇప్పటికైతే చాలా ఊహాజనితమైనవి. దీనికోసం, ప్రస్తుత సాంకేతికతకు ఎలక్ట్రోడ్ విచ్ఛిన్నం, క్రమం తప్పకుండా అల్గారిథమ్లను రీకాలిబ్రేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే, అనేక పరిమితులను ఇంకా అధిగమించాల్సి ఉంది. ప్రజల మెదడు నుండి డేటా సేకరించడం కూడా ఇందులో కీలక సమస్యగా మారుతుంది. ముఖ్యంగా న్యూరాలింక్ వంటి పెద్ద కంపెనీలు కూడా ఇలాంటి పరిశోధనా ఫలితాల నుండి భారీ మొత్తంలో డబ్బు సంపాదించడానికి వీలుంటుంది. అందుకే, ఏఐ టెక్నాలజీ అభివృద్ధిపై ఎప్పటికప్పుడు లోతైన నియంత్రణ ఉండాల్సిన అవసరాన్ని నిపుణులు గుర్తుచేస్తున్నారు.
న్యూరోటెక్నాలజీపై నియంత్రణ, నైతిక చర్చ తక్షణ అవసరాన్ని ఇప్పటికే పలు దేశాలు కూడా ఒప్పుకున్నాయి. ఇక, నాన్-ఇంప్లాంట్ చేయని పరికరాలు, మెదడు-కంప్యూటర్ ఇంటర్ఫేస్లను అభివృద్ధి చేసే కంపెనీల నుండి ముప్పు ఎక్కువగా వస్తుందని కొందరు వాదిస్తున్నారు. వీటిని కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ లాగా పరిగణించడమే వ్యాపార దృక్పధాన్ని పెంచుతుందని అంటున్నారు. అలాకాక, వైద్య పరికరాలుగా పరిగణించబడే స్థాయిలోనే వాటి వినియోగం ఉండాలని సూచిస్తున్నారు. నైతికత, కచ్ఛితమైన నిబంధనలతోనే సానుకూల వినియోగం సాధ్యపడుతుందని అంటున్నారు. కాగా, ఈ కార్యచరణలో మెదడు కార్యకలాపాలు, దాని సమాచారం కోసం వినియోగించే పరికరాల విషయంలో రక్షణ కల్పించిన మొదటి దేశం చిలీ. ఇది మిగిలిన ప్రపంచానికి ఒక ఉదాహరణగా నిలవాలని నిపుణులు అంటారు. ఎందుకంటే.. మెదడు కేవలం ఒక అవయవం కాదు.. అది, ఆలోచనల వలయం. అందులోనూ న్యూరో సైంటిస్ట్లు, మెదడు కార్యకలాపాలను డీకోడ్ చేయగలరు, ఆ సమాచారాన్ని పరిశోధన కోసం క్లినికల్ ప్రాక్టీస్లో ఉపయోగించగలరు. కాబట్టి.. ఇక్కడ మానసిక గోప్యత అనేది ప్రపంచ స్థాయిలో రక్షించబడినప్పుడే అనర్థాలు జరగకుండా ఉంటాయన్నది నిపుణుల మాట.
నిజానికి, ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ వేలాది మంది న్యూరో టెక్నాలజీ నుండి ప్రయోజనం పొందుతున్నారు. ఇలాంటి అత్యంత సాధారణ పరికరాల్లో వెన్నుపూస స్టిమ్యులేటర్లు కూడా ఉన్నాయి. ఇవి 1968లో మొదటిసారిగా మార్కెట్లోకి వచ్చాయి. ఇవి దీర్ఘకాలిక నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే.. వినికిడికి సహాయపడే కోక్లియర్ ఇంప్లాంట్లు, పార్కిన్సన్స్ వ్యాధిలో శరీరాన్ని బలహీనపరిచే వణుకును అణిచివేసే లోతైన మెదడు ఉద్దీపన వ్యవస్థలు కూడా ఉన్నాయి. అయితే, ఈ విజయాల ఇచ్చిన ప్రోత్సహంతో కంప్యూటింగ్, ఇంజినీరింగ్లో పురోగతితో.. పరిశోధకులు అనేక ఇతర నరాల, మానసిక పరిస్థితుల కోసం ఎప్పటికప్పుడు అధునాతన పరికరాలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మెదడు, వెన్నుపూస, నరాలను ఉత్తేజపరిచే పరికరాలకు బదులుగా.. కొన్ని పరికరాలు ఇప్పుడు నాడీ కార్యకలాపాలను పర్యవేక్షించే స్థాయికి చేరుకుంటున్నాయి. ఇప్పుడు, అది ఏ పరిణామాలకు దారితీస్తుందో అనే ఆందోళనలు పెరుగుతున్నాయి.
న్యూరోటెక్నాలజీ మార్కెట్ 2026 నాటికి దాదాపు 75% పెరిగి $17.1 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా ఉంది. కానీ వాణిజ్య పెట్టుబడులు పెరిగేకొద్దీ, న్యూరోటెక్నాలజీ కంపెనీలు ఉత్పత్తులను వదులుకోవడం, వ్యాపారం నుండి వైదొలగడం, వారి పరికరాలపై ఆధారపడే వ్యక్తులను విడిచిపెట్టడం వంటివి చేస్తున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో భవిష్యత్తులో ఇలాంటి టెక్నాలజీ అభివృద్ధి అనేది మరింత బాధ్యతాయుతంగా ఉండాలని అంతర్జాతీయ మానవీయ సంస్థలు చెబుతున్నాయి. ఇక గతంలో ఎలన్ మస్క్ కూడా ఏఐ టెక్నాలజీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ జాతీని నాశనం చేస్తుంది అని చెప్పాడు. అదే సమయంలో.. మెదడును ఇంటర్ఫేస్కు కనెక్ట్ చేయడం వల్ల మానవ మెదడులో “సూపర్ ఇంటెలిజెన్స్”తో కొత్త పొర ఏర్పడుతుందనీ అన్నారు. అందుకే, ఏఐ టెక్నాలజీతో మానవ హితానికి మాత్రమే ఉపయోగపడే ఆవిష్కరణలను చేయాల్సి ఉంది.
.
.