అండర్ -19 వరల్డ్ కప్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో కుర్రాళ్లు అదరగొట్టారు. ముఖ్యంగా ముషీర్ ఖాన్ (131) మరో సెంచరీ చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. టీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ చేసి 8 వికెట్ల నష్టానికి 50 ఓవర్లలో 295 పరుగులు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో 28.1 ఓవర్లలోనే న్యూజిలాండ్ 81 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో 214 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ మొదట్లోనే వికెట్ కోల్పోయింది. 28 పరుగుల వద్ద అర్షిన్ కులకర్ణి (9) ఔటయ్యాడు. ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్కు వచ్చిన ముషీర్ ఖాన్ మరో ఓపెనర్ ఆదర్శ్ సింగ్ (52)తో కలిసి 77 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించాడు. ఆదర్శ్ అవుట్ అయిన తర్వాత సహచరులు ఒకొక్కరు వెనుతిరుగుతున్నా, ఆ ఉన్నవారితోనే విలువైన భాగస్వామ్యాలు నిర్మిస్తూ ముందుకు సాగాడు. స్కోరు బోర్డుని పరుగులెత్తించాడు.
ఈ క్రమంలో 109 బంతుల్లో సెంచరీని సాధించాడు.
అనంతరం గేర్ మార్చి దూకుడుగా పరుగులు సాధించాడు. 126 బంతుల్లో 3 సిక్సులు, 13 ఫోర్లు సాధించి 131 పరుగులు చేశాడు. ఇటీవల ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లోనూ ముషీర్ శతకం సాధించిన విషయం తెలిసిందే. కెప్టెన్ ఉదయ్ (34), అరవెల్లి అవనీశ్ (17) , ప్రియాన్షు (10) , సచిన్ దాస్ (15), రెండంకెల స్కోరు చేశారు. మొత్తానికి 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో రియాన్ 4, మసోన్ క్లార్క్ 2, ఇవాల్డ్ 3 వికెట్లు పడగొట్టారు.
భారీ లక్ష్య ఛేదనలో పరుగులు చేద్దామని భావించిన న్యూజిలాండ్ బ్యాటర్లు భారత బౌలర్ల ధాటికి విలవిల్లాడారు. తొలి ఓవర్లోనే రెండు వికెట్లు తీసి రాజ్ లింబానీని కివీస్ను దెబ్బకొట్టాడు. ఇన్నింగ్స్ తొలి బంతికి టామ్ జోన్స్ను క్లీన్బౌల్డ్ చేసిన లింబాని.. అయిదో బంతికి స్నేహిత్ రెడ్డిని వికెట్లముందు పట్టేశాడు. దీంతో ఖాతా తెరవకముందే న్యూజిలాండ్ రెండు వికెట్లు కోల్పోయింది.
తర్వాత కివీస్ ఏ దశలోనూ కోలుకోలేదు. సౌమి పాండే 10 ఓవర్లు వేసి 19 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. రాజ్ లింబాని 2, ముషీర్ ఖాన్ 2 , నమన్ తివారి, అర్షిన్ కులకర్ణి చెరో వికెట్ పడగొట్టారు.
న్యూజిలాండ్ బ్యాటర్లలో నలుగురు మాత్రమే రెండంకెల స్కోరు అందుకున్నారు. జేమ్స్ నెల్సన్ (10), జాక్ కమ్మింగ్ (16), అలెక్స్ థామ్సన్ (12), కెప్టెన్ ఆస్కార్ జాక్సన్ (19) మాత్రమే కాసేపు భారత భౌలర్లను ఎదురొడ్డి నిలిచారు. ఈ విజయంతో భారత్ సెమీస్ బెర్తు దాదాపు ఖరారైనట్లే. సూపర్ సిక్స్లో టీమిండియా తన ఆఖరి మ్యాచ్ శుక్రవారం నేపాల్తో ఆడనుంది.