Vyuham Movie : ఏపీ పాలిటిక్స్ నేపథ్యంలో వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన ‘వ్యూహం’ చిత్రంపై తెలంగాణ హైకోర్టులో నేడు విచారణ సాగనుంది. నిన్న మరోసారి విచారణ చేసిన న్యాయస్థానం.. తదుపరి విచారణను నేటికి వాయిదా వేస్తున్నట్లు చెప్పింది. ఈ సినిమా విడుదలపై తాజాగా హైకోర్టులో విచారణ జరుగుతుంది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చిత్ర యూనిట్ డివిజన్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో సినిమా విడుదలకు ఆదేశాలివ్వాలని చిత్రయూనిట్ న్యాయస్థానాన్ని కోరింది. కోర్టు తీర్పుపై సర్వాత్రా ఉత్కంఠ నెలకొంది.
వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ తో పాటు పలు రికార్డులను ఇప్పటికే సెన్సార్ బోర్డు కోర్టుకు అందజేసింది. సెన్సార్ బోర్డ్ రికార్డులను పరిశీలించిన అనంతరం విచారణ చేస్తామని న్యాయస్థానం తెలిపింది. సినిమా విడుదల విషయం జాప్యం జరిగితే తనకు భారీగా నష్టం వస్తుందని సినిమా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ కోర్టును అభ్యర్థించారు. ఈ క్రమంలోనే నేడు విచారణ సాగనున్నట్లు సమాచారం.
‘వ్యూహం’ సినిమాను అడ్డుకునేందుకు తెలంగాణ హైకోర్టులో టీడీపీ నేత లోకేష్ పిటిషన్ దాఖలు చేయడంతో చిత్రం విడుదల జాప్యం ఎదురైంది. లోకేష్ పిటిషన్ తో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి సినిమా విడుదలను తాత్కాలికంగా నిలిపివేసింది.