17వ లోక్సభ చివరి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఫిబ్రవరి 9 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభించిన తర్వాత తొలిసారి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది మోదీ సర్కార్. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో కేంద్రం మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. మరో రెండు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉండటంతో.. ప్రస్తుత లోక్సభకు ఇవే చివరి సమావేశాలుకానున్నాయి.
సమావేశాలు ప్రారంభమయ్యాక.. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. కొత్త పార్లమెంట్ భవనంలో ఇది తన తొలి ప్రసంగమని రాష్ట్రపతతి తెలిపారు. ప్రపంచ దేశాలకు ఎన్ని సమస్యలున్నా భారత్ మాత్రం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందన్నారు. భారతదేశ సంస్కృతి, సభ్యత ఎంతో గొప్పదని పేర్కొన్నారు.
ఆసియా క్రీడల్లో తొలిసారి 100 పతకాలు సాధించామని రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు. చంద్రుడి దక్షిణ ధృవంపై తొలిసారి అడుగుపెట్టింది మనమేనని గుర్తుచేశారు. అలాగే మన శాంతినికేన్ హెరిటేజ్ వరల్డ్ లిస్టులో నిలిచిందని తెలిపారు. ముంబై అటల్ సేతు నిర్మాణం పూర్తి చేశామని, తెలంగాణలో సమ్మక్క సారక్క గిరిజన వర్సిటీని నిర్మించామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. జీ -20 సమావేశాలు విజయవంతమయ్యాయి. దేశంలో 5జీ నెట్ వర్క్ వేగంగా విస్తరిస్తోంది. ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్ మన లక్ష్యమని.. వికసిత భారతాన్ని నిర్మిస్తామని ఆమె పేర్కొన్నారు.
రేపు లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని 50 శాతం పెంచి ఎకరాకు 9 వేలకు పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సమావేశాల్లో సభ ముందుకు 19 బిల్లులు ప్రవేశపెట్టనుంది మోదీ సర్కార్.
కాగా.. గత శీతాకాల సమావేశాల్లో ఉభయ సభల నుంచి మొత్తం 146 మంది ప్రతిపక్ష ఎంపీలపై సస్పెండ్ వేటు పడింది. వారిలో 132 మందిని ఆ సెషన్ వరకే పరిమితం చేశారు. మిగిలిన 14 మందిలో 11 మంది రాజ్యసభ సభ్యులు, ముగ్గురు లోక్ సభ సభ్యులు ఉన్నారు. ఈ 14 మంది సభ్యుల కేసును ఉభయ సభల ప్రివిలేజ్ కమిటీలకు పంపించారు. జనవరి 12న లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ ముగ్గురు లోక్ సభ సభ్యులపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేసింది. ఇక గత సమావేశాల్లో పార్లమెంట్ భద్రత, మహువా మొయిత్రా లోక్సభ సభ్యత్వ రద్దుపై ప్రతిపక్షాలు నిలదీయడంతో.. ఉభయ సభల్లోనూ గందరగోళం నెలకొంది. అయితే.. ఈ సారి మాత్రం ఇప్పటికీ విపక్షాలు కార్యాచరణను ప్రకటించలేదు.