Nara Bhuvaneshwari : నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర మంగళవారం బాపట్ల జిల్లాలో కొనసాగింది. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనోవేదనకు గురై మృతి చెందిన వారి కుటుంబసభ్యులను ఆమె పరామర్శించారు. తొలుత కొల్లూరు మండలం చిలుమూరులో రామలింగేశ్వరస్వామి దేవస్థానం సందర్శించారు. వేణుగోపాల స్వామి ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భట్టిప్రోలు మీదుగా చెరుకుపల్లి మండలం చేరుకుని వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు.
వెంకటేశ్వరరావు కుటుంబానికి అండగా ఉంటామని భువనేశ్వరి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి రూ.3లక్షల ఆర్థిక సాయం అందించారు. స్థానికంగా ఉన్న మహిళలతో ఆత్మీయంగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్సీ అనురాధ తదితరులు పాల్గొన్నారు.