Medak Church : ప్రపంచంలో ప్రార్థనల కోసం చర్చిల నిర్మాణం జరిగింది. కానీ.. మన మెతుకు సీమలో కరువు బారిన పడిన పేదల కడుపు నింపేందుకు ఈ చర్చి నిర్మాణం జరిగింది. ఇంతకూ ఆ చర్చి ఎక్కడుంది? దాని విశేషాలేమిటో తెలుసుకుందాం.
అది.. 1914వ సంవత్సరం. 1914 సంవత్సరం. మొదటి ప్రపంచయుద్ధం భీకరంగా జరుగుతున్న రోజులవి. దీని ప్రభావం భారతదేశం మీదా పడింది. ఆర్థిక సంక్షోభం, ఊహించని రీతిలో వచ్చిన కరువుతో ఈ ఏడాది జనం అలో లక్ష్మణా అంటూ అల్లాడుతున్నారు. అప్పటికే దక్షిణ భారతంలో చర్చిలు, స్కూళ్లు, ఆసుపత్రులు కట్టి మత ప్రచారం చేస్తున్న క్రైస్తవ మిషనరీలు.. ఆ ఏడాది నిజాం రాజ్యంలోని మెదక్ ప్రాంతాల్లో అడుగుపెట్టారు.
సరిగ్గా ఇదే సమయంలో చార్లెస్ వాకర్ పాస్నెట్ అనే రోమన్ కాథలిక్ పాస్టర్ ఇంగ్లాండ్ నుంచి 6 నెలలు ఓడలో ప్రయాణించి హైదరాబాద్ ప్రాంతంలోని సనత్నగర్ చర్చికి.. అక్కడి నుంచి మత ప్రచారంలో భాగంగా బదిలీపై మెదక్కు వచ్చి అక్కడి బిషప్ బంగ్లాలో ఒకరాత్రి బస చేశాడు. అక్కడ చర్చి ఎత్తు తక్కువగా, బిషప్ బంగ్లా ఎత్తు ఎక్కువగా ఉండటాన్ని గమనించాడు. దీంతో చర్చిని అందంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో 1914లో ‘పనికి ఆహార పథకం’ పేరుతో ఒక పెద్ద చర్చి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
అప్పటికే మెతుకు సీమ(మెదక్ ప్రాంతం) ఆకలి చావులతో అల్లాడుతోంది. ప్రజలకు పని అనేదే లేకుండా పోవటంతో జనమంతా చర్చి నిర్మాణంలో పాల్గొన్నారు. పదేళ్ల పాటు కొనసాగిన చర్చి నిర్మాణంతో ప్రజలకు పట్టెడన్నం దొరకటంతో బాటు అద్భుతమైన చర్చి నిర్మాణమూ జరిగింది. అదే మెదక్ సీఎస్ఐ చర్చిగా పేరొందింది. 1924లో క్రిస్మస్ రోజున చర్చిని ప్రారంభించారు. అప్పట్లో ఈ నిర్మాణానికి రూ. 14 లక్షలు ఖర్చు అయినట్లు అంచనా.
ఈ చర్చి గోపురం ఎత్తు 175 అడుగులు. పొడవు 200 అడుగులు, వెడల్పు 100 అడుగులు. ఈ కట్టడానికి మూడు గవాక్షములు, పలు రంగుటద్దములతో ప్రతిష్టింపజేశారు. తూర్పున క్రీస్తు జన్మవృత్తాంతం, పడమర శిలువవేసినదృశ్యం, ఉత్తరాన క్రీస్తు చనిపోయి మూడో రోజు సజీవుడైన దృశ్యాలను అందంగా చర్చిలో యూరోపియన్ శైలిలో చిత్రీకరించారు. ఫ్రాంకోఓ, సాలిస్బరి అనే బ్రిటిష్ చిత్రకారులు కేవలం సూర్యకాంతితోనే ఈ మూడు దృశ్యాలు కనిపించేలా తీర్చిదిద్దారు. వీటికోసం ప్రతి అద్దానికి మధ్యలో ద్రవస్థితిలోని తగరాన్ని వాడారట.
చర్చి కట్టిన తొలి మూడేళ్లు.. రీసౌండ్ వచ్చేదట. దీని నివారణకు 1927లో ఇంగ్లాండ్కు చెందిన బాడ్షా, గ్యాస్హోప్ అనే ఇంజనీర్లు రబ్బరు, కాటన్, మరికొన్ని రసాయనాలను ఉపయోగించి ఈ సమస్యను దూరంచేశారు. ఈ చారిత్రాత్మక కట్టడం విస్తీర్ణంలో ఆసియాలోనే అతి పెద్ద చర్చిగా గుర్తింపుపొందింది.