Alzheimers : అల్జీమర్స్ ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది! నిజమే. వైద్యచికిత్సలో పొరపాట్ల వల్ల అత్యంత అరుదుగా మతిమరుపు వ్యాధి ఇతరులకూ సోకే ప్రమాదం ఉందని తాజా పరిశోధనలో వెల్లడైంది. ఎన్నడో దశాబ్దాల క్రితం తీసుకున్న చికిత్స వల్ల బ్రిటన్కు చెందిన ఐదుగురిలో ఈ వ్యాధి లక్షణాలు వృద్ధి చెందాయి. ఈ అంశంపై ఇలాంటి పరిశోధన జరగడం ఇదే తొలిసారి.
మనిషి ఎదుగుదలకు కీలకమైన ప్రొటీన్ను చిన్నతనంలో తీసుకున్న కారణంగా డిమెన్షియా వచ్చినట్టు వెల్లడైంది. అయితే మృతి చెందిన వ్యక్తి మెదడు నుంచి తీసిన గ్రోత్ హార్మోన్లను ఇవ్వడమే దీనికి ప్రధాన కారణం. ఇలా 1959-85 మధ్య బ్రిటన్లో 1800 మంది చికిత్స పొందారు. ఇందుకోసం చనిపోయిన వారి పిట్యుటరీ గ్లాండ్(పియూష గ్రంథి) నుంచి గ్రోత్ హార్మోన్ను తీసి.. పేషంట్లకు ఇచ్చారు. ప్రస్తుతం అయితే ఈ హార్మోన్ను సింథటిక్ పద్ధతుల్లో తయారు చేస్తున్నారు.
అంతగా ఎత్తు పెరగని చిన్నపిల్లలకు చికిత్సలో భాగంగా ఈ హార్మోన్ ఇచ్చేవారు. 1985లో అలా చికిత్స పొందిన వారిలో ఒకరు అత్యంత అరుదైన క్రొయట్స్ఫెల్ట్ యాకూబ్(Creutzfeldt-Jakob) వ్యాధికి గురై మరణించారు. ప్రైన్ అనే ప్రొటీన్ కారణంగా బ్రెయిన్లో సాధారణ ప్రొటీన్ స్థాయులు కూడా అపరిమితంగా పెరిగిపోతాయని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. దీని వల్ల మెదడు దెబ్బతింటుంది. కణాలు శరవేగంగా నశించిపోతుంటాయి.
ప్రైన్ వ్యాధి మానవులకే కాదు.. జంతువుల్లోనూ రావొచ్చు. గ్రోత్ హార్మోన్ చికిత్స తీసుకున్న అనంతరం మెదడు దెబ్బతింటున్న వారి సంఖ్య పెరిగిపోతుండటంతో మృత శరీరాల నుంచి హార్మోన్ తీసి.. చికిత్స అందించే విధానానికి స్వస్త పలికారు. అయితే క్రొయట్స్ఫెల్ట్ యాకూబ్ వ్యాధి బారిన పడిన బాధితులను నిశితంగా పరిశీలించగా.. వారి మెదళ్లలో ప్రైన్ ప్రొటీన్ పేరుకుపోయినట్టు ఐదుగురు బాధితుల్లో గుర్తించారు. అల్జీమర్స్ వ్యాధి ప్రధాన లక్షణాల్లో ఇదొకటి. 38-55 ఏళ్ల వయసులో ఆ బాధితుల్లో మతిమరుపు లక్షణాలు పెరిగాయని యూనివర్సిటీ కాలేజి ఆఫ్ లండన్ పరిశోధకులు వెల్లడించారు.