Satnam Singh Sandhu : పంజాబ్కు చెందిన విద్యావేత్త సత్నామ్ సింగ్ సంధూ రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనను నామినేట్ చేశారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
సత్నామ్ సింగ్ సంధూకు పంజాబ్ లో గొప్ప విద్యావేత్తగా పేరుంది. చండీగఢ్ యూనివర్సిటీని ఆయనే స్థాపించారు. ఓ మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించి సత్నామ్ చిన్నతనం నుంచే చదువుపై ఎంతో ఆసక్తిని చూపించారు. ఎన్నో ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో ఉన్నత విద్యను అభ్యసించారు. తాను అనుభవించిన బాధలు ఎవరూ పడకూడదనుకున్నారు. అందువల్లే విద్యాసంస్థలను స్థాపించారు.
2001లో మొహాలీ సమీపంలో చండీగఢ్ గ్రూప్ ఆఫ్ కాలేజీలను సత్నామ్ నెలకొల్పారు. ప్రపంచస్థాయి విద్యాప్రమాణాలతో బోధన అందించాలని సంకల్పించారు. ఆ తర్వాత 2012లో చండీగఢ్ యూనివర్సిటీని స్థాపించారు. ఆయన కష్టం ఫలించింది. ఆయన సేవలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లంభించింది. 2023లో క్యూఎస్ వరల్డ్ రికార్డ్స్లో చండీగఢ్ యూనివర్శిటీకి చోటు దక్కింది. ఆసియాలోనే అత్యుత్తమ ప్రైవేట్ వర్సిటీగా ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ప్రస్తుతం ఈ వర్సిటీకి ఛాన్సలర్ గా సత్నామ్ సింగ్ సంధూనే వ్యవహరిస్తున్నారు.
విద్యావేత్తగా ఎంతో పేరు సంపాదించిన సత్నామ్ దాతృత్వ కార్యక్రమాలు చేయడంలో ముందున్నారు. రెండు ఛారిటీ సంస్థలను ఏర్పాటు చేశారు. పేద విద్యార్థులకు ఆర్థికసాయం చేస్తున్నారు. విద్యా రంగంలో చేసిన సేవలను గుర్తించిన కేంద్రం సత్నామ్ ను రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యత్వం కల్పించింది.
రాజ్యసభకు నామినేట్ అయిన సత్నామ్ సింగ్ సంధూకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. సత్నామ్ గొప్ప విద్యావేత్త అని కొనియాడారు.పేదలకు సేవ చేస్తూ సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారని ప్రశంసించారు. దేశ సమైక్యత కోసం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. సత్నామ్ పార్లమెంటరీ ప్రయాణం ఉత్తమంగా సాగాలని ఆకాంక్షించారు.