Flex War In AP : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాజకీయ హీట్ రోజు రోజుకు పెరుగుతోంది. అధికార, ప్రతి పక్ష పార్టీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయం రసవత్తరంగా మారింది.
ఎన్నికల యుద్ధానికి సిద్ధం కావాలంటూ వైసీపీ శ్రేణులను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సిద్ధం చేశారు. ఉత్తరాంధ్రలో ఎన్నికల సమర శంఖాన్ని పూరించారు. విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలోని సంగివలస బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. సిద్ధం పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. తమ ప్రభుత్వం నాలుగేళ్లలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. స్కీములే తన ప్రచార అస్త్రాలని ప్రకటించారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేశానని జగన్ చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం నుంచి మేలు జరిగిందని భావిస్తే ఓటు వేయాలని ప్రజలను కోరారు.
ఇక సిద్ధం బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫెక్సీలను ఏర్పాటు చేసి కార్యకర్తలతో కొట్టించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఇలా ఎన్నికల రణరంగంలోకి జగన్ దూకుడుగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు బెజవాడలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీలకు కౌంటర్ గా జనసేన నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి యుద్ధానికి సై అన్నారు. వైసీపీ, జనసేన మధ్య బెజవాడలో ఇలా ఫెక్సీ వార్ మొదలైంది. జనసేన ఫ్లెక్సీలో మేమూ సిద్ధమే అంటూ రాశారు. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ ట్యాగ్ లైన్ ఇచ్చారు. దీంతో రెండు పార్టీల మధ్య పొలిటికల్ హీట్ మరింత పెరిగింది.