Mysteries Of The Earth Core : అంతు తెలియని జిజ్ఞాస మానవుడిని నిత్యం నవ్యావిష్కరణల వైపు నడిపిస్తుంది. చంద్రుడిపై కాలు మోపినా.. సముద్రం లోతుల్లోకి వెళ్లినా అందుకు కారణం అదే. ప్రపంచ దేశాల మధ్య ఇప్పుడో పోటీ ఆరంభమైంది. భూమి అట్టడుగు పొరల్లో ఏమి ఉందనే అన్వేషణ మొదలైంది. ఈ రేసులో చైనా, జపాన్, జర్మనీ దేశాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు.
భూమి మధ్యభాగం(కోర్) రహస్యాలు తెలుసుకునేందుకు 30 వేల అడుగుల మేర డ్రిల్లింగ్ చేసే పనిని ఆయా దేశాలు చేపట్టాయి. ఈ విషయంలో రష్యా అగ్రభాగాన నిలిచింది. పూర్వపు సోవియట్ రష్యా హయాంలో 36,201 అడుగుల(11,034 మీటర్లు) మేర తవ్విన కోలా సూపర్డీప్ బోర్ హోల్ ఇప్పటి వరకు భూమికి చేసిన అత్యంత లోతైన రంధ్రం. 1979 మే 24న ఆరంభమై తవ్వకం పూర్తి కావడానికి 20 ఏళ్లు పట్టింది.
అయితే అంత లోతుకు మించి వెళ్లలేకపోయారు. ఎందుకంటే అప్పటికే అక్కడి ఉష్ణోగ్రతలు శాస్త్రవేతలు ఊహించిన దాని కన్నా ఎక్కువగా అంటే 180 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంది. దాంతో 1992లో డ్రిల్లింగ్ను నిలిపివేశారు. అనంతరం మూసివేశారు. భూమి క్రస్ట్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే నిమిత్తం రష్యా ఆ ప్రాజెక్టును చేపట్టింది. దానిని ‘వెల్ టూ హెల్’ అని వ్యవహరించేవారు.
రష్యా రికార్డుకి ఇప్పుడు చైనా చేరువ కానుంది. 30 వేల అడుగుల లోతుకు వెళ్లాలని పట్టుదలతో ఉంది. అయితే తొలిసారిగా సముద్ర ఉపరితలం నుంచి ఆ రంధ్రం చేస్తోంది. ఇది విజయవంతమైతే ఎగువ మాంటిల్ అంచులకు చేరుకునే తొలి మానవ ప్రయత్నం కాగలదు. భూగర్భశాస్త్ర పరిశోధనల్లో ఇదో మైలురాయిగా నిలుస్తుంది. ఓషన్ డ్రిల్లింగ్ షిప్ మెంగ్ జియాంగ్ ద్వారా ఈ డ్రిల్లింగ్ చేస్తోంది.
భూపొరల లోగుట్టును తెలుసుకోవడంతో పాటు ఇప్పటివరకు వెలుగులోకి రాని ఖనిజ వనరుల కోసం అన్వేషించాలనేది డ్రాగన్ దేశం లక్ష్యం. అలాగే భూకంపాలు, అగ్నిపర్వతాల విస్ఫోటనం ముప్పును ముందే పసిగట్టగలిగే కొత్త మార్గాల అన్వేషణకు ఈ డ్రిల్లింగ్ దోహదపడగలదని భావిస్తున్నారు. చమురు, గ్యాస్ నిక్షేపాల అన్వేషణ కూడా ఈ ప్రాజెక్టులో భాగం.
చైనా చేపట్టిన డ్రిల్లింగ్ భూమి అడుగున దాదాపు 10 రాతి పొరలను చీల్చుకొంటూ కొనసాగుతాయి. ఇందుకు భారీ, అత్యాధునిక యంత్రాలను ఉపయోగిస్తున్నారు. వీటి బరువే 2 వేల టన్నులు ఉంటుంది. డ్రిల్లింగ్లో అత్యంత సంక్లిష్టమైన దశలు కూడా ఉన్నాయి. భూమి లోపల క్రెటేషియస్ పొర వరకూ తొలుచుకుంటూ వెళ్తారు. దాదాపు 145 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ పొర ఏర్పడి ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
భూపొరలపై శాస్త్రీయ పరిశోధనలు, అన్వేషణల నిమిత్తం ఇతర దేశాలు కూడా డీప్ డ్రిల్లింగ్ ప్రాజెక్టులను చేపట్టాయి. ఎర్త్ మాంటిల్ వరకు రంధ్రం చేస్తామని జపాన్ ప్రకటించింది. 2017లో చిక్యు డీప్ సీ డ్రిల్లింగ్ నౌక సాయంతో 13,200 అడుగుల మేర నీటిలో, 19,536 అడుగుల లోతులోని ఎగువ మాంటిల్ అంచులకు చేరుకొనే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. రెండేళ్ల అనంతరం 10,560 అడుగుల లోతుకు మాత్రమే వెళ్లగలిగింది.
జర్మనీ కూడా అంతే. జర్మన్ కాంటినెంటల్ డీప్ డ్రిల్లింగ్ ప్రోగ్రాం(KTB)ను 1980లలో చేపట్టింది. 29,527 అడుగుల మేర రంధ్రం చేయగలిగింది. భారీ వ్యయాన్ని సైతం లెక్కచేయక దేశాలు ఇలా పోటాపోటీగా భూమికి డ్రిల్లింగ్ చేయడానికి ప్రధాన కారణం మిథేన్ హైడ్రేట్. భవిష్యత్తు ఇంధనమైన దీనిని ‘ఫ్లేమబుల్ ఐస్’ అని కూడా వ్యవహరిస్తారు.
మిథేన్ హైడ్రేట్ చూడటానికి మంచులాగా ఉంటుంది. దానికి సమీపంగా మంటను తీసుకొచ్చినప్పుడు జ్వలిస్తుంది. అందుకే ఫ్లేమబుల్ ఐస్ అని పేరొచ్చింది. బొగ్గు, చమురు, గ్యాస్ వంటి శిలాజ ఇంధనాలు రాన్రాను తగ్గిపోతున్నందున ఫ్లేమబుల్ ఐస్ ఎంతో విలువైనదిగా భావిస్తున్నారు.