Neel Acharya : అమెరికాలోని పర్డ్యూ విశ్వవిద్యాలయంలో చదువుతున్న భారత్ కు చెందిన విద్యార్థి నీల్ ఆచార్య ఆదివారం నుంచి కనిపించకుండా పోయాడు. అతని ఆచూకి కోసం గాలింపు చేపట్టగా.. క్యాంపస్ లోనే ఉన్న ఒక భవనం వద్ద మంగళవారం అతని మృతదేహం లభ్యమైందని విశ్వవిద్యాలయానికి చెందిన కంప్యూటర్ సైన్స్ తాత్కాలిక విభాగాధిపతి క్రిస్ క్లిఫ్టన్ ధృవీకరించారు. కాలేజీ మ్యాగజైన్ ది ఎక్స్ పోనెంట్ లోనూ ఇందుకు సంబంధించిన కథనాన్ని ప్రచురించారు.
నీల్ ఆచార్య తల్లి గౌరీ ఆచార్య.. తన కొడుకు కనిపించడం లేదని, అతని ఆచూకీ తెలుసుకునేందుకు సహాయం చేయాలని ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. చివరిసారిగా ఒక ఉబర్ డ్రైవర్ అతడిని క్యాంపస్ లో విడిచిపెట్టినట్లు తెలిపారు. గౌరీ ఆచార్య పోస్ట్ పై చికాగోలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. విశ్వవిద్యాలయ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, అందుకు కావలసిన సహకారాన్ని అందిస్తామని హామీనిచ్చింది. ఇంతలోనే నీల్ ఆచార్య మృతదేహం లభ్యమైంది.
మరో ఘటనలో లిథోనియా నగరంలో ఉంటున్న వివేక్ సైనీ (25) దారుణ హత్యకు గురయ్యాడు. జూలియన్ ఫాల్క్నర్ అనే వ్యక్తి సైనీ తలపై 50 సార్లు సుత్తితో మోదీ హతమార్చాడు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. భారత్ లో బీటెక్ పూర్తి చేసిన సైనీ.. ఇటీవలే యూఎస్ లో ఎంబీఏ పట్టా అందుకున్నారు. సైనీ హత్య వార్తతో అతని తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు.