Delhi Crime : ఆలు-మగల దాంపత్యం సృష్టికి మూలం. స్వలింగ సంపర్కం అందుకు విరుద్ధం. అయినా సరే.. టెక్నాలజీతో పాటే మనమూ అప్డేట్ అవ్వాలంటూ.. ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు పెళ్లిళ్లు చేసుకుని కాపురాలు కూడా చేస్తున్నారు. ఇదంటే పరస్పర ఇష్టంతో జరుగుతుంది. కానీ.. స్నేహం ముసుగులో అసహజ శృంగారానికి బలవంతం చేస్తున్నారు కొందరు దుర్మార్గులు. అలా ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నార్త్ ఢిల్లీలో జనవరి 17న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అసహజ శృంగారానికి బలవంతం చేయడంతో.. యువకుడి తలపై బండరాయితో మోది హతమార్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని బీహార్ కు చెందిన రాజేశ్ గా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి 19న మోరీ గేట్ కు దగ్గరలోని డీడీఏ పార్క్ వద్ద గుర్తుతెలియని మృతదేహం చూసి.. స్థానికులు పోలీసులకు ఫోన్ కాల్ చేశారు. ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా మృతుడి శరీరంపై తీవ్రగాయాలు కనిపించాయి. మృతదేహాన్ని మార్చురీకి తరలించి.. స్థానికంగా ఉన్న 50 సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. వాటి ద్వారా మృతుడు ఉత్తరప్రదేశ్ లోని జలాన్ జిల్లాకు చెందిన ప్రమోద్ కుమార్ శుక్లాగా గుర్తించారు.
ప్రమోద్ కుమార్.. కోయా మండిలోని ఒక దుకాణంలో పనిచేసేవాడని పోలీసులు తెలిపారు. అతను నైట్ షెల్టర్ లో ఉంటున్నాడని, ఫుటేజ్ లో శుక్లాతో పాటు రాజేశ్ అనే వ్యక్తి చివరిసారిగా కనిపించినట్లు పేర్కొన్నారు. అతడిని పాట్నాలో అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. అసలు విషయం తెలిసింది. ప్రమోద్ కుమార్ తనను అసహజ శృంగారంలో పాల్గొనాలని ఒత్తిడి చేసేవాడని, అది తనకు ఇష్టంలేకనే అతడిని పదకం ప్రకారం హత్య చేసినట్లు రాజేశ్ పోలీసుల ఎదుట అంగీకరించాడు.