Anti-Piracy Operation : అరేబియా సముద్రంలో 36 గంటల వ్యవధిలో భారత్ మరోసారి డేరింగ్ ఆపరేషన్ చేపట్టింది. సోమాలియా పైరేట్స్(Somalia Pirates) చెర నుంచి 19 మంది పాకిస్థానీ నావికుల్ని రక్షించింది. యుద్ధనౌక ఐఎన్ఎస్ సుమిత్ర(INS Sumitra)ను రంగంలోకి దింపిన ఇండియన్ నేవీ(Indian Navy) సముద్రపు దొంగలను తరిమికొట్టింది.
ఇండియన్ నేవీ వివరాల ప్రకారం సోమవారం సోమాలియా తీరంలో ఇరాన్ జెండాతో ఉన్న అల్ నయీమీ ఫిషింగ్ నౌకను సోమాలియా పైరేట్స్ చుట్టుముట్టారు. 19 మంది పాకిస్థానీ నావికుల్ని బంధించారు. సమాచారం అందుకున్న భారత యుద్ధనౌక ఐఎన్ఎస్ సుమిత్ర అల్ నయీమీ ఫిషింగ్ నౌకను అడ్డగించి, బందీలను విడిపించింది.
కొద్ది గంటల ముందు కూడా ఇండియా ఇదే తరహా ఆపరేషన్ చేపట్టింది. శనివారం అరేబియా సముద్రంలో ఇరాన్ చేపల బోటు ఇమాన్ను సోమాలియా దొంగలు అపహరించారు. రక్షించమంటూ ఈ బోటు నుంచి ఆదివారం ఇండియన్ నేవీకి ఎమర్జెన్సీ మెసేజ్ అందింది. INS సుమిత్ర, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ధ్రువ్ రంగంలోకి దిగి.. 17 మంది మత్స్యకారులను రక్షించిన సంగతి తెలిసిందే.
హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో హూతీ తిరుగుబాటుదారులు గత కొద్ది రోజులుగా ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులు చేస్తున్నాయి. ఇటీవల గల్ఫ్ ఆఫ్ ఎడెన్ (Gulf of Aden)లో ఆయిల్ ట్యాంకర్లతో వెళుతున్న అమెరికా మార్లిన్ లాండ నౌకపై క్షిపణితో దాడి చేశారు. ఆ నౌక నుంచి వచ్చిన అత్యవసర సందేశానికి స్పందించిన ఇండియన్ నేవీ.. ఐఎన్ఎస్ విశాఖపట్నం నౌకను రంగంలోకి దింపి, సహాయ చర్యలు చేపట్టింది.