Ganjai Chocolates : తెలంగాణలో గంజాయి చాక్లెట్ల వ్యవహారం హాట్టాపిక్గా మారింది. కొన్ని రోజులుగా వివిధ ప్రాంతాల్లో చాక్లెట్లు లభ్యం కావటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. విద్యార్థులు, యువత కోసమే ఈ దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. రాష్ట్రంలో వరుస ఘటనలు జరగటంతో టాస్క్ఫోర్స్ అధికారులు.. తనిఖీలు ముమ్మరం చేశారు.
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి చాక్లెట్లు కలకలం సృష్టించాయి. కోకపెట్ రాంకీ కనస్ట్రక్షన్ కంపెనీ దగ్గర అధికారులు రైడ్స్ నిర్వహించారు. ఒడిశాకు చెందిన సోమ్యా రాజన్ నుంచి వివిధ బ్రాండ్లకు సంబంధించిన 40 గంజాయి చాకెట్ల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఓ అపార్టుమెంట్ లో కార్మికులకు అమ్ముతుండగా ఎన్ ఫోర్స్ మెంట్ పోలీసులు సోమ్యా రాజన్ పట్టుకుని అరెస్టు చేశారు. హైదరాబాదుకు ఉపాధి కోసం వచ్చి గంజాయి చాక్లెట్లను అమ్ముతున్నట్లు గుర్తించారు. ఖమ్మం జిల్లా వరంగల్ క్రాస్ రోడ్డులో భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో తనిఖీలు నిర్వహించారు ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పొలీసులు. ఔరంగబాద్ కు చెందిన ఇద్దరు మహిళల నుంచి ఎనిమిది కిలోల గంజాయి.. మూడు కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళల్ని అరెస్ట్ చేశారు పోలీసులు.
ఖమ్మం నగరంలో గంజాయి చాక్లెట్లు పట్టుబడటంతో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటివరకు హైదరాబాద్ వంటి నగరాలకే పరిమితమైన అలవాట్లు.. జిల్లాల్లోనూ విస్తరించటంపై జనాలు భయపడుతున్నారు. చిన్న పిల్లలు తినే విధంగా.. సేమ్ టు సేమ్ చాక్లెట్లు లాగానే తయారు చేస్తూ ముఠా అమ్మకాలు చేస్తోంది. గంజాయి చాక్లెట్ల రాకెట్ను ఆబ్కారీ టాస్క్ ఫోర్స్ బృందం.. గుట్టు రట్టు చేశారు. కాల్వొడ్డు ప్రాంతంలో తనిఖీలు చేస్తుండగా ఇద్దరు నిందితుల దగ్గర మూడు కిలోల గంజాయి చాక్లెట్స్ తో పాటు 8 కిలోల గంజాయిని గుర్తించారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తి.. ఔరంగాబాదుకు చెందిన ముగ్గురు మహిళలను.. ఆబ్కారీ బృందం సోదా చేయగా.. 27 కిలోల గంజాయి దొరికింది.
వికారాబాద్ జిల్లా తాండూర్ లోని పాన్ షాపుల్లో జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసుల తనిఖీలు నిర్వహించారు. నిషేధిత హుక్కా ఫ్లేవర్స్ , గంజాయి పేపర్స్ సీజ్ చేశారు. ఘటనకు బాధ్యులైన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వరుస ఘటనలతో మరింత అప్రమత్తమైన అధికారులు.. తనిఖీలను మరింత పెంచుతున్నట్లు చెబుతున్నారు.