IND vs ENG Test : ఇండియా స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా వివాదంలో చిక్కుకున్నాడు. దానివల్ల ఐసీసీ మందలించడమే కాదు, ఒక డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చింది. విషయం ఏమిటంటే మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఓలీ పోప్ ను అవుట్ చేయడం టీమ్ ఇండియా బౌలర్ల వల్ల కాలేదు. నాలుగో రోజు ఆట సందర్భంగా బుమ్రా బౌలింగ్ పోప్ షాట్ కొట్టి స్పీడుగా పరుగెట్టాడు. బుమ్రా అతనికి అడ్డంగా వెళ్లి నిలుచుకున్నాడు. దీంతో పోప్ తనని గట్టిగా ఢీకొట్టాడు. అయితే రన్ అవుట్ కాకుండానే క్రీజులోకి చేరుకున్నాడు.
ఇది జరిగిన కాసేపటికే ఓలిపోప్ వికెట్ ను బుమ్రా తీసుకున్నాడు. అయితే ఉద్దేశపూర్వకంగానే పోప్కు అడ్డువెళ్లాడని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కు మ్యాచ్ రిఫరీ నివేదించాడు. అంతర్జాతీయ నిబంధనలు లెవెల్ 1 రూల్స్ని టీమిండియా పేసర్ అతిక్రమించాడని తెలిపారు.
దీంతో సంబంధిత అధికారులు వీడియోను క్షుణ్ణంగా పరిశీలించారు. చివరికి బుమ్రా తప్పు చేసినట్లు తేల్చారు. అయితే బుమ్రా వివాదాన్ని పెద్దది చేయకుండా, తన పొరపాటును అంగీకరించాడు. దీంతో వివాదం ఇక్కడితో ముగిసిపోయింది. కాకపోతే బుమ్రా ఖాతాలో ఐసీసీ ఓ డీమెరిట్ పాయింట్ను చేర్చింది.
నిజానికి పోప్ గానీ రన్ అవుట్ అయి ఉంటే, బుమ్రా క్రికెట్ జీవితంలో ఒక చెరగని మచ్చగా ఉండిపోయేది. అంతేకాదు పోప్ డబుల్ సెంచరీ బుమ్రా వల్లే మిస్ అయ్యిందనే నిందను కాసేవాడు. అలాగే టీమ్ ఇండియా కూడా పోప్ ను అవుట్ చేయలేక అడ్డదారులు తొక్కుతుందనే అపవాదు భరించాల్సి వచ్చేది. మొత్తానికి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టడంతో ఇక్కడితో ఆగిపోయింది.
ఈ మ్యాచులో బుమ్రా తొలి ఇన్నింగ్స్లో 2, రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీశాడు. మొత్తం 6 వికెట్లు తీశాడు. 196 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన ఓలీ పోప్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఈ విజయంతో ఇంగ్లాండ్ 5 మ్యాచుల టెస్టు సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఫిబ్రవరి 2 నుంచి రెండు జట్ల మధ్య విశాఖపట్నం వేదికగా రెండో టెస్టు జరగనుంది.