CM KCR : గెలిచామని గర్వపడకుండా బాధ్యతతో పని చేయాలని.. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా పని చేయాలని మునుగోడు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డికి సీఎం కేసీఆర్ సూచించారు. ఆయా శాఖల మంత్రులు, అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రణాళికా బద్దంగా ముందుకు సాగాలని జిల్లా నేతలను ఆదేశించారు. టీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకంతో మునుగోడు ప్రజలు మనల్ని గెలిపించారని.. ఆ విశ్వాసం నిలుపుకునేలా అభివృద్ధి చేసి చూపించాలన్నారు కేసీఆర్.
మునుగోడు విజయం తర్వాత తాజా ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. సీఎం కేసీఆర్ ను కలిశారు. మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులంతా కలిసి ప్రగతి భవన్ కు వెళ్లారు. ఎమ్మెల్యేగా గెలిచిన కూసుకుంట్లను ముఖ్యమంత్రి అభినందించారు. మునుగోడు గెలుపు కోసం పని చేసిన పార్టీ నేతలందరినీ అభినందించారు.