Hamas War : యూఎన్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (యూఎన్ఆర్డబ్ల్యూఏ).. పాలస్తీనా శరణార్థుల పురోభివృద్ధి, సహాయం కోసం పనిచేస్తున్న ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ. పాలస్తీనా జనాభాలో 87 శాతం మంది సేవలు పొందుతున్నది దీని ద్వారానే. అక్టోబర్ 7 నాటి హమాస్ మెరుపు దాడుల్లో యూఎన్ఆర్డబ్ల్యూఏ సిబ్బంది కూడా పాల్గొన్నారనేది ఇజ్రాయెల్ తాజా ఆరోపణ.
పాలస్తీనా మాత్రమే కాదు.. పశ్చిమాసియాలో లక్షలాది మంది పౌరులకు ఆ ఏజెన్సీ సేవలు అందుతున్నాయి. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా శరణార్థులుగా మారిన వారికి ఆహారం,నీళ్లు, షెల్టర్ అందిస్తున్న ప్రధాన సంస్థగా దానికి పేరుంది. యూఎన్ఆర్డబ్ల్యూఏ వ్యవహారశైలిపై ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
75 ఏళ్ల పాలస్తీనా శరణార్థి సంక్షోభాన్ని సజీవంగా ఉంచే స్థాయికి హమాస్తో ఆ ఏజెన్సీ సిబ్బంది చేతులు కలిపారన్న తీవ్రమైన ఆరోపణలు గతంలోనే ఉన్నాయి. పౌరులకు ఐక్యరాజ్యసమితి ఏజెన్సీల ద్వారా అందాల్సిన నిధులు, సాయాన్ని హమాస్, ఇతర మిలిటెంట్ గ్రూపులు మిలటరీ అవసరాల కోసం మళ్లిస్తున్నాయని కూడా మండిపడింది. అక్టోబర్ 7 నాటి హమాస్ మారణహోమంలో ఐరాస ఏజెన్సీ సిబ్బంది పాత్ర ఉందని పేర్కొంది.
ఖాన్యూనిస్లో ఆ ఏజెన్సీ స్కూల్ కౌన్సిలర్, అతడి కొడుకు కలిసి ఇజ్రాయెల్ మహిళను అపహరించారని ఇజ్రాయెల్ సర్కారు తాజా ఆరోపణ చేసింది. 97 మందిని బలిగొన్న బేరీ కిబుట్జ్ నరమేధంలోనూ మరో ఉద్యోగి పాల్గొన్నాడంటూ అమెరికాకు పంపిన డోసియర్లో ఇజ్రాయెల్ పేర్కొంది. హమాస్ దాడిలో ఆ ఏజెన్సీ సిబ్బంది పాల్గొన్నారన్న విషయం వెలుగుచూడగానే.. 12 మందిని ఐక్యరాజ్యసమితి తొలగించింది.
గాజాపై ఇజ్రాయెల్ దాడులతో 7 లక్షల మంది పాలస్తీనియన్లు శరణార్థి శిబిరాలకు చేరినట్టు అంచనా. ఇలాంటి వారికి సాయం అందించే లక్ష్యంతో యూఎన్ ఆర్డబ్ల్యూఏ ఏర్పడింది. శరణార్థి శిబిరాలు ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లు, ఆరోగ్య శిబిరాల నిర్వహణ, మౌలిక వసతుల కల్పనను ఆ ఏజెన్సీ ప్రధానంగా చూస్తుంటుంది. గాజా ప్రాంతంలోనే దానికి 13 వేల మంది ఉద్యోగులున్నారు. వారిలో అత్యధికులు పాలస్తీనియన్లే.
గాజా 23 లక్షల మంది జనాభాలో 85 శాతం మేర ప్రస్తుతం సొంత ఇళ్లను వదిలేసి శరణార్థులుగా బతుకుతున్నారు. యూఎన్ఆర్డబ్ల్యూఏ స్కూళ్లు, ఆ ఏజెన్సీకి చెందిన ఇతర షెల్లర్లలోనే 10 లక్షల మంది ఉన్నట్టు అంచనా. పౌరులకు అందాల్సిన సాయం దారి మళ్లి హమాస్ చేతుల్లోకి చేరుతున్నా.. యూఎన్ఆర్డబ్ల్యూఏ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. అక్టోబర్ 7 నాటి దాడుల్లో ఏజెన్సీ ఉద్యోగుల పాత్రకు సంబంధించి ఆధారాలను సైతం బయటపెట్టింది.
ఇక యూఎన్ఆర్డబ్ల్యూఏకు అందుతున్న నిధుల్లో అధిక వాటా అమెరికాదే. తాజా పరిణామాల నేపథ్యంలో ఆ సంస్థకు నిధులను నిలిపివేసిన తొలి దేశం కూడా అదే. 2022లో అమెరికా ఒక్క దేశమే 340 మిలియన్ డాలర్ల మేర ఫండింగ్ అందజేసింది. అమెరికా బాటలోనే.. బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, ఫిన్లాండ్ తదితర దేశాలు కూడా సాయాన్ని నిలిపివేశాయి. యూఎన్ఆర్డబ్ల్యూఏ 2022 బడ్జెట్లో 60 శాతం వాటా ఆ తొమ్మిది దేశాలదే.
ఇంత భారీ మొత్తంలో సాయం నిలిచిపోతే.. యూఎన్ఆర్డబ్ల్యూఏ రోజువారీ కార్యకలాపాలపై ఎంత ప్రభావం పడుతుందన్నదీ ఇప్పటికిప్పుడే చెప్పడం కష్టం. నార్వే, ఐర్లండ్ దేశాలు మాత్రం యూఎన్ఆర్డబ్ల్యూఏకు ఫండింగ్ను కొనసాగిస్తామని చెబుతున్నాయి. ఇతర డోనర్లు ఏం నిర్ణయం తీసుకున్నారన్నదీ తెలియాల్సి ఉంది.