Crude Oil : ఎర్రసముద్రంలో హౌతీల దాడులు, ఉద్రిక్తతలున్నా.. ముడి చమురు సరఫరాకు మాత్రం ఎలాంటి ఢోకా కనిపించడం లేదు. ధరల పెరుగుదల బాధ మినహా మన దేశానికి సరఫరా అయ్యే క్రూడాయిల్ విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి చిక్కుల్లేవని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా సరుకు రవాణా జరుగుతుండటం వల్ల ధరల్లో మాత్రం స్పష్టమైన మార్పు కనపడుతోందని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్(HPCL) చైర్మన్ పుష్పకుమార్ జోషి చెప్పారు. ముడి చమురు దిగుమతుల్లో మూడో అతి పెద్ద దేశం మనదే. ఇందులో అధికభాగం రష్యా నుంచి ఎర్రసముద్రం ద్వారా దేశానికి చేరుతోంది.
నిరుడు క్రూడాయిల్ దిగుమతుల్లో 35% రష్యా చమురే. రోజుకి 1.7 మిలియన్ బారెళ్ల చొప్పున చమురు సరఫరా అవుతోంది. ప్రస్తుతం హౌతీల దాడుల నుంచి రష్యా రవాణా నౌకలకు మినహాయింపు ఉంది. కాకపోతే.. సూయిజ్ కాలువ-ఎర్రసముద్రం మీదుగా కాకుండా.. ఆఫ్రికా దక్షిణ కొన మీదుగా చమురు రవాణా జరుగుతుండటం వల్ల రవాణా ఖర్చులు పెరిగాయి. అదే సమయంలో నౌకల కొరత కూడా వేధిస్తోంది.
దూరం పెరగడంతో భారత్ నుంచి అమెరికాకు రవాణా నౌకలు చేరడానికి 10-14 రోజుల అదనపు సమయం తీసుకుంటోంది. అలాగే యూరప్, మద్యధరా ప్రాంతం నుంచి షిప్మెంట్ల రాకకు 20-25 రోజులు అదనంగా పడుతోంది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి.
గత మూడు రోజులుగా రేట్లలో పెరుగుదల కొనసాగుతూనే ఉంది.
మూడు రోజుల క్రితం ముడి చమురు ధర ఏకంగా 3% పెరిగింది. సోమవారం కూడా ధరలు 1 శాతం మేర పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బ్యారెల్ క్రూడాయిల్ ధర 83 డాలర్ల నుంచి 84.38 డాలర్లకు పెరిగింది. చమురు ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. అయితే సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో..
ఈ ధరల భారాన్ని ప్రజలపైకి నెట్టేసే సాహసం ఇప్పట్లో మోదీ సర్కారు చేయకపోవచ్చు.