YCP Rebel MLAs : ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇచ్చిన నోటీసును వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు సవాల్ చేశారు. హైకోర్టును ఆశ్రయించారు. స్పీకర్ నోటీసును సవాల్ చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. సభ్యత్వం ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ ఇటీవల నలుగురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని నోటీసు ఇచ్చారు.
పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఎందుకు సభ్యత్వం రద్దు చేయకూడదో చెప్పాలని కోరారు.ఈ క్రమంలో స్పీకర్ నోటీసును సవాల్ చేస్తూ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మండలి ఛైర్మన్ నోటీసును ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య కూడా సవాల్ చేశారు.
మరోవైపు స్పీకర్ నోటీసుపై విచారణకు హాజరయ్యారు. స్పీకర్ తమ్మినేని సీతారాంను కలిశారు. ఈ విషయాలు నలుగురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు వెల్లడించారు. తాను క్రాస్ ఓటింగ్కు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయా అని ఆనం రామనారాయణరెడ్డి ప్రశ్నించారు. గంటా శ్రీనివాసరావు రాజీనామాపై మూడున్నరేళ్లు స్పీకర్ పట్టించుకోలేదన్నారు. తనకు నోటీసిచ్చిన 2 వారాల్లోనే సమాధానం ఇవ్వమంటున్నారని మండిపడ్డారు.
సమాధానం ఇవ్వడానికి సమయం కోరతానని ఉండవల్లి శ్రీదేవి అన్నారు. తాను కొవిడ్తో బాధపడుతున్నానని తెలిపారు. ఇంకా సెలైన్ పెట్టుకుంటూనే ఉన్నానని తెలిపారు. తన అనారోగ్యంపై వైద్యులు ఇచ్చిన నివేదికను స్పీకర్ పట్టించుకోలేదని మేకపాటి చంద్రశేఖర్రెడ్డి అన్నారు. స్పీకర్ను కలిసి మళ్లీ సమయం కోరతానన్నారు. విప్ ఉల్లంఘించామనడానికి వాళ్ల వద్ద ఉన్న ఆధారాలేమిటి? అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్ ఉల్లంఘించామని ఎలా నిర్ధారించారు? అని నిలదీశారు. రహస్య ఓటింగ్లో విప్ ఉల్లంఘించామని ఎలా చెబుతారు? అని ఎదురు ప్రశ్నించారు. సమయం ఇవ్వాలని కోరానని అయితే స్పీకర్ నిరాకరించారని కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు.
మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. తన రాజీనామా ఆమోదంపై వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ వేయాలని స్పీకర్, న్యాయశాఖ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. కౌంటర్ వేయాలని సీఈసీ, ఎస్ఈసీకి కూడా నోటీసులు ఇచ్చింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.