Ravindra Jadeja : మూలిగే నక్కపై తాటి పండు పడటం అంటే ఇదేనేమో… అసలే విరాట్ కొహ్లీ లాంటి సీనియర్ లేక సతమతం అవుతున్న టీమ్ ఇండియాకి మరో షాక్ తగిలింది. సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా దూరం అవుతున్నాడనే వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. దీంతో ఏం జరిగిందని అభిమానులు తీవ్రంగా సెర్చ్ చేస్తున్నారు.
మొదటి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా బ్యాటింగ్ లో ఉన్నాడు. రూట్ వేసిన ఫుల్ టాస్ను ఫీల్డర్ వైపునకు గట్టిగా కొట్టాడు. ఆ స్ట్రోక్ కు కచ్చితంగా సింగిల్ వస్తుందనే కాన్ఫిడెన్స్ తో పరుగుకు ప్రయత్నించాడు. అనూహ్యంగా బెన్ స్టోక్స్ బంతిని మెరుపు వేగంతో అందుకున్నాడు.
అంతేకాదు డైరక్ట్ త్రో వేసి రనౌట్ చేశాడు. ఇది కూడా మ్యాచ్ కి టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే తొలి ఇన్నింగ్స్ లో కీలకమైన 87 పరుగులు చేసిన జడేజా మ్యాచ్ ని నిలబెడతాడని అంతా అనుకున్నారు. కానీ అంతలోనే అవుట్ అయిపోయాడు. ఇక్కడ విషయం ఏమిటంటే అంత వేగంగా పరుగెత్తే సమయంలో జడేజా తొడ కండరాలు పట్టేశాయి.
దాంతో ఇబ్బంది పడుతూనే గ్రౌండ్ ని వీడాడు. అయితే జడేజా తొడకండరాల గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఫిబ్రవరి 2న ప్రారంభంకానున్న వైజాగ్ టెస్టుకు అతడు అందుబాటులో ఉండే అవకాశం అనుమానంగా కనిపిస్తోంది.
రవీంద్ర జడేజా లేకపోయినా గుడ్డిలో మెల్లగా ఒక అవకాశం అయితే శివమ్ దుబె రూపంలో కనిపిస్తోంది. తను రెడీగా ఉన్నాడు. దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో ముంబై జట్టు తరఫున శివమ్ దుబే ఆడుతున్నాడు.
ఉత్తరప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు. 110 బంతుల్లో సెంచరీ చేసి సెలక్టర్లకు తానున్నానని గుర్తు చేశాడు. ఒకవేళ రవీంద్ర జడేజా ఒకవేళ రాలేకపోతే శివమ్ దుబె ఆప్షన్ గా తీసుకోవచ్చునని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే జడేజా గాయం తీవ్రత గురించి, మరో ఆల్ రౌండర్ ఆవశ్యకతపై టీమిండియా మేనేజ్మెంట్ స్పందించాల్సి ఉంది.