Fire Accident : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ క్వార్టర్స్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 47 వాహనాలు దగ్దమయ్యాయి. రామచంద్రాపురం, చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడ్డ వాహనాలను పోలీస్ క్వార్టర్స్ ప్రాంగణంలో ఉంచారు. అగ్నిప్రమాదంలో 36 బైకులు, 8 కార్లు, 3 ఆటోలు అగ్నికి ఆహుతైనట్లు రామచంద్రాపురం సీఐ కట్టా నరేందర్ రెడ్డి వెల్లడించారు.
పోలీస్ క్వార్టర్స్ ప్రహారీ గోడకు అవతల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా బీడీని వెలిగించి పడేసారా అనే అనుమానాలు సీఐ వ్యక్తం చేశారు. చుట్టూ ఎండిగడ్డి ఉండటంతో ఒక్కసారి మంటలు చెలరేగాయన్నారు. దీంతో వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయని తెలిపారు. పోలీసులు ఫైరింజన్ సిబ్బందితో కలిసి మంటలను అదుపులోకి తెచ్చారన్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు.