Rebel MLA’s : ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్నారు. అటు వైసీపీ, ఇటు టీడీపీలో అధిష్టానానికి రెబల్ ఎమ్మెల్యేలు తలనొప్పిగా మారారు. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నోటీసులు పంపారు. స్పీకర్ కార్యాలయంలో ఇవాళ అనర్హత పిటిషన్లపై విచారణ జరగనుంది. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలను ఉదయం 12 గంటలకు విచారణకు హాజరు కావాలని, అలాగే టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు మధ్యాహ్నం 2.45 గంటలకు రావాలని స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది.
వైసీపీ, టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని స్పీకర్ పేషీ ఆదేశాలిచ్చింది. వివరణ ఇచ్చేందుకు ఒక్కొక్క ఎమ్మెల్యేకు 15 నిమిషాల వరకు స్పీకర్ కార్యాలయం సమయాన్ని కేటాయించింది. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల హాజరుపై ఉత్కంఠ కొనసాగుతోంది.అయితే వివరణ ఇవ్వాలా వద్దా అన్నదానిపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు న్యాయ నిపుణుల సలహా తీసుకోనున్నారు. ఇప్పటికే వివరణ ఇవ్వడానికి 30 రోజులు గడువు కావాలని వైసీపీ రెబెల్స్ స్పీకర్ తమ్మినేని సీతారాంకు లేఖ రాశారు. స్పీకర్ నిర్ణయం ఎలా ఉంటుందన్న దానిపై చర్చ కొనసాగుతోంది.
తన రాజీనామాను స్పీకర్ హడావుడిగా ఆమోదించడం వెనకు కుట్ర ఉందని టీడీపీ నేత గంటా శ్రీనివాస్ ఆరోపించారు. మూడేళ్ల క్రితం రాజీనామా చేస్తే.. ఎన్నికలకు మూడు నెలలు ముందు ఆమోదిస్తారా? అని ప్రశ్నించారు. ఇప్పటికిప్పుడు ఆమోదించాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. ఓటమి భయంతోనే ఇప్పుడు ఆమోదించారని గంటా శ్రీనివాస్ ఆరోపించారు.
వైసీపీలో అసంతృప్త జ్వాలలు ఆకాశాన్నంటుతున్నాయి. అధినేత బుజ్జగింపులు, చర్చలతో బిజీబిజీగా ఉంటే.. కిందిస్థాయి నేతలు విమర్శలు, రాజీనామాలతో పార్టీపై కత్తులు దూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ జోరు ఉండదన్న అనుమాలు వ్యక్తం చేస్తున్నారు.