Rayachoti : రాయచోటి సెగ్మెంట్ రాజకీయం రంజుగా మారింది. జగన్ సొంత జిల్లా కడపలోని ఆ నియోజకవర్గంలో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. అక్కడ సీనియర్ పొలిటీషియన్ అయిన ద్వారకానాథ్రెడ్డి ఒకసారి ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. ముఖ్యమంత్రి సొంత మనిషి అయిన ఎంపీ విజయసాయిరెడ్డికి స్వయానా బావమరిది ద్వారకానాథ్. అలాంటాయన తన బావతో పాటు పార్టీకి షాక్ ఇచ్చి పసుపు కండువా కప్పేసుకున్నారు. గత ఎన్నికల్లో రాయచోటి ఎమ్మెల్యేగా శ్రీకాంత్రెడ్డి విజయానికి కృషి చేసిన ఆయన.. ఇప్పుడాయన మీదే పోటీకి సిద్ధమై సవాళ్లు విసురుతున్నారు. అసలు విజయసాయి బావమరిది పసుపు కండువా కప్పుకోవడం ఏంటి..? ద్వారకానాథ్ వైసీపీకి గుడ్బై చెప్పడానికి కారణమేంటి..?
మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథ్రెడ్డి. ఉమ్మడి కడప జిల్లాలో సీనియర్ పొలిటీషియన్. రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి దగ్గరి బంధువు.. పైపెచ్చు వైసీపీలో నెంబరు టూగా ఫీలయ్యే రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ద్వారకానాథ్ సొంత బావమరిది. కాంగ్రెస్లో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయనకు తర్వాత వైసీపీలోకి వచ్చినప్పటికీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కలేదు. గత ఎన్నికల్లో శ్రీకాంత్ రెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించారు.
2019లో రాయచోటి వైసీపీ టికెట్ ఆశించిన ద్వారకనాథ్రెడ్డికి నిరాశే ఎదురైంది. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్టు చైర్మాన్ ఇస్తామని పార్టీ పెద్దలు ఇచ్చిన హామీతో ఆయన శ్రీకాంత్రెడ్డి విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే టీటీడీ చైర్మన్ పదవి అందని ద్రాక్షగా మారడంతో ఆయన్ సడెన్గా అదీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో వైసీపీకి గుడ్బై చెప్పేశారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దాంతో రాయచోటి లో రాజకీయం రంజుగా మారిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ద్వారకనాథ్ రెడ్డి 1994 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున అప్పటి లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం ఎమ్మెల్యే గా గెలుపొందారు. తర్వాత పోటీ చేసే అవకాశం రాకపోవడంతో కొంతకాలం రాజకీయాలకు దూరమయ్యారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత బావ విజయసాయిరెడ్డి ప్రభావంతో అందులో చేరి రాయచోటి పాలిటిక్స్లో యాక్టివ్ అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో ఆయన రాయచోటి నియోజకవర్గం అసెంబ్లీ టికెట్ ఆశించినా అది దక్కలేదు. అయినా ఇంత కాలం పార్టీకి విధేయుడిగానే ఉంటూ వచ్చారు. అలాంటిదిప్పుడు విజయసాయి బామ్మరిది పార్టీకి స్ట్రోక్ ఇచ్చి పసుపు కండువా కప్పుకోవడం వైసీపీకి పెద్ద మైనస్సే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయితే ద్వారకనాథ్ రెడ్డి టీడీపీలో చేరికను ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి వర్గం వ్యతిరేకిస్తోందట. ఈ సారి ద్వారకానాథ్రెడ్డికి టీడీపీ టికెట్ దక్కుతుందన్న ప్రచారాన్ని రెడ్డప్పగారి రమేష్కుమార్రెడ్డి శిబిరం జీర్ణించుకోలేకపోతోందంట. ఇంతకాలం పార్టీకోసం పనిచేస్తే కొత్తగా వచ్చిన ద్వారకనాథ్ రెడ్డి కి ఎలా టికెట్ ఇస్తారని గుర్రుగా ఉన్నారట. రమేష్ రెడ్డి తన తండ్రి, మాజీ మంత్రి ఆర్.రాజగోపాల్రెడ్డి రాజకీయ వారసుడిగా టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1999 ఎన్నికల్లో లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో ఓడిపోయారు.
నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2009లో జరిగిన ఎన్నికల్లో రమేష్రెడ్డి రాజంపేట పార్లమెంటు సెగ్మెంట్ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో రాయచోటి ఎమ్మెల్యేగా పోటీ చేసినా లక్ కలసిరాలేదు. మొదటి సారి తండ్రి సెంటిమెంట్తో గెలిచిన రమేష్ నియోజకవర్గంలో ఆ పట్టు నిలుపుకోలేకపోయారని అందుకే వరుస పరాజయాలు ఎదుర్కొన్నారని భావిస్తున్న టీడీపీ అధిష్టానం ఆ లెక్కలతోనే ద్వారకానాథ్ను అక్కున చేర్చుకుని వచ్చే ఎన్నికల్లో టికెట్ హామీ కూడా ఇచ్చిందంటున్నారు.
అదలా ఉంటే రాయచోటి టీడీపీలో నలుగురు అభ్యర్ధులు టికెట్ రేసులో కనిపిస్తున్నారు. ఇప్పుడు ద్వారకనాథ్రెడ్డి చేరికతో వారి రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. రాయచోటి సిట్టింగ్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డిని నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు అక్కడి ఓటర్లు. అయితే ఆయన హయాంలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ది జరగలేదన్న విమర్శలు ఉన్నాయి.
శ్రీకాంత్రెడ్డిపై ఉన్న వ్యతిరేకతను టీడీపీ క్యాష్ చేసుకోవడంలో విఫలం అవుతోందని తెలుగుతమ్ముళ్లు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుంటారు. కేవలం గ్రూపు రాజకీయాలు కారణంగా గెలిచే అవకాశం ఉన్నా టీడీపీ ఓటమి మూటగట్టుకుంటోందట. మరిప్పుడు ద్వారకనాథ్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన మిగిలిన టీడీపీ నేతలను ఎంతవరకు కోఆర్డినేట్ చేసుకుంటారో..? పార్టీ నేతలు ఆయనకు ఎంత వరకు సహకరిస్తారో చూడాలి.
.
.