Gajuwaka : గత ఎన్నికల్లో గాజువాకలో జనసేన అధినేత పవన్కళ్యాణ్ని ఓడించిన వైసీపీ ఇప్పుడు గడ్డు పరిస్థితి ఎదుర్కుంటోంది. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని కాదని ఇన్చార్జిగా మరొకరికి బాధ్యతలు కట్టబెట్టారు వైసీపీ అధ్యక్షుడు. దాంతో ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఎమ్మెల్యే తర్వాత ఏమనుకున్నారో ఏమో కాని పార్టీ నిర్ణయాన్ని పాటిస్తామని గట్టిగా చెప్తున్నారు. కాని ఆచరణలో మాత్రం కొత్త ఇన్చార్జికి చుక్కలు చూపిస్తున్నారంట. మరోవైపు గత ఎన్నికల్లో తండ్రి విజయంలో కీలకపాత్ర పోషించిన దేవన్రెడ్డి వైసీపీకి రిజైన్ చేసి సదరు ఇన్ఛార్జిని డోంట్కేర్ అంటున్నారంట. దాంతో గాజువాకలో వైసీపీకి కష్టాలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
విశాఖపట్నం జిల్లాలో అత్యంత కీలకమైన నియోజకవర్గం గాజువాక. గత ఎన్నికల్లో జనసేనాని పవన్కళ్యాణ్ అక్కడ నుంచి పోటీ చేయడంతో గాజువాక అందరి దృష్టిని ఆకర్షించింది. గాజువాకలో పవన్కు చెక్ పెట్టడంలో సక్సెస్ అయిన వైసీపీ ఇప్పుడు ఆధిపత్యపోరుతో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పుడు గాజువాకలో మొదలైన ఆధిపత్యపోరు వైసీపీ పెద్దలకికి పెద్ద తలనొప్పిగా మారిందట. సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని, అక్కడ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న ఆయన కొడుకు దేవన్రెడ్డిని కాదని గాజువాక కొత్త ఇన్ఛార్జిగా ఉరికూటి రామచంద్రరావు అలియాస్ చందూని ప్రకటించింది వైసీపీ .
అధిష్టానం నిర్ణయాన్ని బహాటంగానే వ్యతిరేకించారు సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి.. ఆయన కొడుకు దేవన్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి వైసీపీ పార్టీ సభ్యుత్వానికి, సోషల్ మీడియా కన్వీనర్ పదవికి కూడా రాజీనామా చేసేశారు. జనసేనాని పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఓడించిన సిట్టింగ్ ఎమ్మెల్యేకు సీటు ఎందుకు ఇవ్వరంటూ వైసీపీ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతోవైసీపీ అధిష్టానం దిద్దుబాటు చర్యలు స్టార్ట్ చేసింది. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, అతని కొడుకు దేవన్ రెడ్డితో ఉత్తరాంధ్ర వైసీపీ కన్వీనర్ వైవీ సుబ్బారెడ్డి చర్చలు జరిపారు. అధిష్టానం బుజ్జగింపుతో కొత్త ఇన్చార్జికి సహకరిస్తామని తండ్రి, కొడుకులు తమ నిర్ణయాన్ని ప్రకటించారు.
కొత్త ఇన్చార్జికి సహకరిస్తామన్న తండ్రి కొడుకులు.. ఆచరణలో మాత్రం తమ సొంత అజెండా మొదలుపెట్టారు. ఇన్ఛార్జి ప్రకటన వెలువడినప్పటి నుంచి రామచంద్రరావు గాజువాక నియోజకవర్గంలో అన్ని ఏరియాలను కవర్ చేస్తూ మీటింగులు పెడుతున్నారు. సొంత కేడర్ ను సెట్ చేసుకునే పనిలో పడ్డారు. ప్రతి మీటింగ్ కు సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డిని, అతని కేడర్ని కూడా ఆహ్వానిస్తున్నారు. అయితే ఉరికూటి చందు పెట్టిన ఒక్క మీటింగ్కి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కానీ, అతని కొడుకు దేవన్ రెడ్డి కానీ హాజరు కాలేదు. దీంతో సింగిల్ గానే ఉరికూటి చందు తన పని తాను చేసుకుపోవాల్సి వస్తోంది.
ఎమ్మెల్యే నాగిరెడ్డి వర్గం ఉరికూటి చందుపై సోషల్ మీడియా వేదికగా కొత్త ప్రచారం మొదలుపెట్టింది. ఉరికూటి చందు ప్రస్తుతం విశాఖ 70వ డివిజన్ కార్పొరేటర్. ఆ డివిజన్ నుండి ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలోకి వెళ్లిపోతున్నారని నాగిరెడ్డి వర్గం తెగ పోస్టులు పెడుతోంది. మరోవైపు దేవన్ రెడ్డి సైలెంట్ గా విజయవాడలో మకాం వేసి జనసేన నాయకులను కలిసి గాజువాక సీటు ఇవ్వమని అడిగారంట. అటువైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదంట. దాంతో మళ్ళీ వైసీపీ అధిష్టానం దగ్గర తమ బలం చూపించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నాయకుల చేత సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి కానీ లేదా దేవన్ రెడ్డికి కానీ సీటు ఇవ్వాలని గెలిపించి తీరతామని.. ఉరికూటి చందుకు ఇస్తే క్యాడర్ సహకరించదని అధిష్టానానికి చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
మరోపక్క 87వ డివిజన్ కార్పొరేటర్ కోమటి శ్రీనివాస్, 74వ డివిజన్లో టీడీపీ నుండి పోటీ చేసి ఓడిపోయిన పల్లా రమణలు గాజువాక నుంచి వైసీపీ టికెట్ కోసం లాబీయింగ్ చేసుకుంటున్నారు. ఇప్పటికే సీఎం జగన్ గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉరికూటి చందును ప్రకటించడంతో వారి లాబీయింగ్లు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో కాని ఒకవేళ టికెట్ దక్కకపోతే వారిద్దరు చందూకి సహకరించే పరిస్థితి లేదంటున్నారు.
అదలా ఉంటే రానున్న ఎన్నికల్లో ఉరికూటి రామచంద్రరావుకు సీటు రావడం వెనుక మంత్రి గుడివాడ అమర్నాథ్, పార్టీ సీనియర్ నాయకుడు దామా సుబ్బారావులు ఉన్నట్లు తెలుస్తుంది. గత ఎన్నికల్లో పవన్కళ్యాణ్పై నెగ్గిన నాగిరెడ్డి ఎమ్మెల్యేగా నియోజకవర్గం ప్రజలను పట్టించుకుపోవడం, పార్టీ కార్యక్రమాలను కూడా అధిష్టానం చెప్పిన విధంగా చేయకపోవడం వల్లే సీటు రాలేదని తెలుస్తుంది.
అలాగే వైసీపీ అధిష్టానం ఉరికూటి రామచంద్రరావుకు సీటు కేటాయించడం వెనుక చాలా లెక్కలే వేసుకున్నట్లు కనిపిస్తుంది. గాజువాక నియోజకవర్గంలో రెడ్డి సామజికవర్గం 17 శాతం మాత్రమే ఉంది. యాదవ సామజికవర్గం ఓటర్లు 40 శాతం మంది ఉన్నారు. చందూ కూడా యాదవ వర్గం వ్యక్తే. 3లక్షల 20 వేలు పైగా ఓటర్లు కలిగిన గాజువాక నియోజకవర్గంలో కాపులు, యాదవులు ఓట్లు నిర్ణయాత్మకంగా ఉంటాయి. ఉరుకూటి చందు భార్య కాపు వర్గానికి చెందిన వారు. దాంతో యాదవ, కాపు ఈక్వేషన్ కలిసి వస్తుందని వైసీపీ పెద్దలు లెక్కలు వేసుకున్నారంట.
ఇక గాజువాక మొదటి సర్పంచ్ ఉరుకూటి చందు తాత. అక్కడ చందు తండ్రి ఉరుకూటి అప్పారావుకి యాదవ వర్గంలో పలుకుబడి ఉంది. ఆ లెక్కలతోనే వైసీపీ అధిష్టానం చందుని పోటీలోకి దించినట్లు తెలుస్తుంది. యాదవ సామాజిక వర్గానికి చెందిన గాజువాక టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కి చెక్ పెట్టేందుకే వైసీపీ చందూ వైపు మొగ్గుచూపిందంటున్నారు. అయితే నాగిరెడ్డి ఫ్యామిలీ ఇప్పుడు చందూకి వ్యతిరేకంగా పనిచేస్తుండటం.. రెబల్గానైనా ఎన్నికల బరిలోకి దిగే పరిస్థితి కనిపిస్తుండటంతో గాజువాక వైసీపీలో చీలిక స్పష్టంగా కనిపిస్తోంది.
.
.