IND vs ENG Test Series : హైదరాబాద్ లో ఇంగ్లాండ్ తో జరిగిన తొలిటెస్టులో టీమ్ ఇండియా ఓటమి పాలైంది. అయితే స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేక చతికిలపడిపోయింది. కర్ణుడి చావుకి కారణాలనేకం అన్నట్టు టీమ్ ఇండియా ఓటమికి ఐదు కారణాలున్నాయి.
1. ఫీల్డింగ్ వైఫల్యం… పోయిన 50-60 పరుగులు..
బహుశా టీమ్ ఇండియా ఆటగాళ్లు టీ 20 ఆటకి బాగా అలవాటు పడిపోయినట్టున్నారని సీనియర్లు అంటున్నారు. ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ ఆడలేక, ఒళ్లు వంచలేక ఫీల్డింగ్ లో తడబడుతున్నారు. తొలి టెస్ట్ మ్యాచ్ లో నాసిరకం ఫీల్డింగ్ కారణంగా సుమారు 10 బౌండరీలను వదిలేశారని, ఇంకా ఇతర పరుగులతో కలిపి కనీసం 50 నుంచి 60 పరుగులు పోయాయని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
2. క్యాచ్ డ్రాప్లు..
అలాగే చేతుల్లోకి వచ్చిన క్యాచ్ లను నేలపాలు చేశారు. ఇంత నాసిరకమైన ఫీల్డింగ్ ని ఈ మధ్యకాలంలో చూడలేదని సీనియర్లు అంటున్నారు. ఓలిపోప్ ఇచ్చిన రెండు సులువైన క్యాచ్ లను అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ వదిలేశారు.
116 పరుగుల వద్ద అక్షర్ వదిలేస్తే, 180 దగ్గర రాహుల్ వదిలేశాడు. దీంతో తను రెచ్చిపోయాడు. టీమ్ ఇండియా ఓటమికి కారణమయ్యాడు. ఈ మధ్యలో ఒక కష్టతరమైన క్యాచ్ ని యశస్వి జైశ్వాల్ కూడా వదిలేశాడు. అక్షర్ పటేల్ క్యాచ్ పట్టి ఉంటే, టీమ్ ఇండియా పరిస్థితి మరోలా ఉండేది.
3. బ్యాటింగ్ ఘోరం
అన్నింటికి మించి రెండో కారణం ఏమిటంటే బ్యాటింగ్ వైఫల్యం. మొదటి ఇన్నింగ్స్ లో అందరూ అద్భుతంగా ఆడి, రెండో ఇన్నింగ్స్ కి వచ్చేసరికి గల్లీ ప్లేయర్లలా ఆడి వికెట్లు పారేసుకున్నారు.పరిస్థితులను బట్టి ఆడటంలో గిల్, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరూ విఫలమయ్యారు. టెస్ట్ మ్యాచ్ లో కావల్సిన ప్రధాన లక్షణాన్ని వారిద్దరూ అలవరుచుకోలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
4. సీనియర్లు రావాలి- కావాలి
టీమ్ ఇండియాలో సీనియర్లు లేకపోవడం, ముఖ్యంగా విరాట్ కోహ్లీ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఒకరకంగా చెప్పాలంటే బ్యాటర్లలో రోహిత్ శర్మ మాత్రమే జట్టులో సీనియర్ గా ఉన్నాడు. మిగిలిన వాళ్లందరూ కుర్ర బ్యాటర్లే. అనుభవలేమితో కష్టకాలంలో జట్టుని ఆదుకోలేకపోయారు. కనీసం రెండో టెస్టులో అయినా కోహ్లీ వచ్చేవరకు మరొక సీనియర్ ని తీసుకోవాలని సూచిస్తున్నారు. పుజారా, ఆజ్యింక రహానేలను తిరిగి జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
5.కొత్తగా ప్రయత్నించని కెప్టెన్
రోహిత్ శర్మ ఎంతసేపు తనకిచ్చిన బౌలర్లతోనే మ్యాచ్ ని తీసుకువెళుతున్నాడు. కొత్తగా ప్రయత్నించడం లేదని సీనియర్లు అంటున్నారు. తొలి ఇన్నింగ్స్ లో 4 ఓవర్లు మాత్రమే సిరాజ్ కి ఇచ్చాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో 7 ఓవర్లు ఇచ్చాడు, తనని పూర్తిస్థాయిలో వాడలేదు.
ఇక ఐదుగురు పనిచేయనప్పడు బ్యాటర్లతో ఒకట్రెండు ఓవర్లు వేయించాల్సిందని అంటున్నారు. జస్ట్ ఛేంజ్ ఆఫ్ మూడ్ కోసమని అన్నారు. ఎంతసేపు తిప్పినా వారితోనే తిప్పి తిప్పి బౌలింగ్ వేయించడంతో సరైన ఫలితం రాలేదని అంటున్నారు.