India vs England 1st Test : బాల్ బాల్ కి… టెన్షన్… టెన్షన్
అద్భుతంగా పోరాడిన అశ్విన్-భరత్ జోడి
28 పరుగుల తేడాతో టీమ్ ఇండియా ఓటమి
టామ్ హార్ట్ లీకి 7 వికెట్లు
231 పరుగుల ఊరించే టార్గెట్.. బాల్ బాల్ కి టెన్షన్. టెయిల్ ఎండర్స్ స్ఫూర్తితో మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. టీమ్ ఇండియా పోరాడి ఓటమి పాలైంది.
అరవీర భయంకరమైన టీమ్ ఇండియా టాపార్డర్.. అంతా చేతులెత్తేశారు. 7 వికెట్ల నష్టానికి 119 పరుగులు.. అంతా అయిపోయిందనుకున్నారు. కానీ ఇద్దరు మాత్రం చివరి వరకు అద్భుత పోరాట పటిమను ప్రదర్శించారు. వారే రవిచంద్రన్ అశ్విన్ (28), తెలుగు తేజం, వికెట్ కీపర్ కేఎస్ భరత్ (28).. ఇద్దరూ కలిసి 8 వికెట్ కి 57 పరుగుల అద్భుత భాగస్వామ్యంతో ఆశలు రేపారు.
వీరి భాగస్వామ్యంతో భారత్ స్కోరు 176 పరుగులకి చేరింది. మ్యాచ్ టీమ్ ఇండియా వైపునకు తిరిగిందని అంతా అనుకున్నారు. కానీ ఇద్దరూ వెంటవెంటనే అవుట్ కావడంతో భారత్ ఓటమి ఖాయమైపోయింది. అయినా సరే, ఆఖరి వికెట్ కు బుమ్రా, సిరాజ్ పట్టు వదలకుండా ఆడారు.
సిరాజ్ 12 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. బుమ్రా 6 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అలా టీమ్ ఇండియా 202 పరుగులకు ఆలౌట్ అయ్యింది. చివరికి 28 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
ఓడితే ఓడారు కానీ, మ్యాచ్ మంచి మజా ఇచ్చిందని, టెయిల్ ఎండర్స్ ఎక్సాటార్డనరీగా ఆడారనే ప్రశంసలు వినిపిస్తున్నాయి. నెట్టింట్లో వారిపై అభినందనల జల్లు కురుస్తోంది. మంచి ఉత్కంఠభరితమైన మ్యాచ్ చూశామంటున్నారు.
అరవీర భయంకరమైన టీమ్ ఇండియా టాప్ ఆర్డర్ 231 లక్ష్యాన్ని కళ్లు మూసుకుని కొట్టేస్తారని అంతా అనుకున్నారు. కానీ పరిస్థితి అంతా తారుమారైంది. ఇంగ్లాండ్ స్పిన్నర్ టామ్ హార్ట్ లీ 7 వికెట్లతో భారత్ వెన్ను విరిచాడు. దీంతో మన బ్యాటర్లు ఒకరి తర్వాత ఒకరు క్యూ కడుతూ పెవిలియన్ చేరారు. విరాట్ కోహ్లీ లేని లోటు ఈ మ్యాచ్ లో స్పష్టంగా కనిపించింది. ఒకే ఒక్క సీనియర్ రోహిత్ శర్మ మాత్రమే ఉండటంతో కుర్రాళ్లతో మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది.
నాలుగో రోజు ఉదయం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ఓవర్ నైట్ స్కోరు 316కి మరో 104 పరుగులు జోడించి 420 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. భారత్ బౌలింగ్ దళాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. భారత్ బౌలింగ్ లో బుమ్రా 4, అశ్విన్ 3, జడేజా 2, అక్షర్ పటేల్ 1 వికెట్ పడగొట్టారు.
ఒంటిచేత్తో ఇంగ్లాండ్ ను ముందుకు నడిపించిన ఒలీ పోప్ దురదృష్టవశాత్తూ 196 పరుగుల వద్ద అవుట్ అయిపోయాడు.
డబుల్ సెంచరీ మిస్ అయ్యాడు. బుమ్రా బౌలింగ్ లో అడ్డంగా ఆడబోయి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కానీ మరపురాని ఇన్నింగ్స్ ఆడాడని పలువురు కొనియాడారు. అయితే ఇది ఒలీ పోప్ కెరీర్ లోనే చిరస్థాయి మ్యాచ్ గా నిలిచిపోతుంది.
మొత్తానికి టీమ్ ఇండియాకి 231 పరుగుల టార్గెట్ ఇచ్చింది. ఎప్పటిలాగే కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్ ఆత్మవిశ్వాసంతో మొదలుపెట్టారు. తొలి ఇన్నింగ్స్ లో అద్భుతంగా ఆడి 80 పరుగులు చేసిన యశస్వి ఈసారి దెబ్బకొట్టేశాడు.15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
ఫస్ట్ డౌన్ వచ్చిన శుభ్ మన్ గిల్ అయితే మరీ దారుణంగా ఆడాడు. తన ఘోరమైన ఫామ్ ని ఇక్కడ కూడా కొనసాగించాడు. కీలకమైన దశలో ఆడి, అందరి నోళ్లూ మూయిస్తాడని అనుకుంటే…రెండో బాల్ కే సున్నా చుట్టేశాడు. డకౌట్ అయి భారంగా వెనుతిరిగాడు.
ఇంక గిల్ ని ఆ దేవుడే కాపాడాలని, టీమ్ ఇండియాలో స్థానాన్ని ప్రశ్నార్థకం చేసుకున్నాడని విమర్శకులు మళ్లీ తమ నోళ్లకు పని చెప్పారు. అయితే తనొక్కిడిదే తప్పు అని అనలేం. దాదాపు అందరూ కూడా అలాగే ఆడారు.
తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ బాధ్యతగానే ఆడాడు. బజ్ బాల్ వ్యూహంలో ఆడి స్కోరుని పరుగెత్తించి, ఒత్తిడి తగ్గిద్దామని అనుకున్నాడు. ఆ క్రమంలో 39 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
ప్రమోషన్ లో వచ్చిన అక్షర్ పటేల్ కాసేపు పోరాడు. బ్రేక్ తర్వాత వెంటనే మొదటి ఓవర్ లో అవుట్ అయిపోయాడు. మొత్తానికి తనవంతుగా 17 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు.
మ్యాచ్ ను కాపాడతాడు, బాధ్యతాయుతంగా ఆడతాడనుకున్న కేఎల్ రాహుల్ అనూహ్యంగా 22 పరుగులు చేసి వికెట్ల ముందు ఎల్బీడబ్ల్యూగా దొరికిపోయాడు. డీఆర్ఎస్ కోరినా ఫలితం లేకుండా పోయింది. ఇదే మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి.
ఇక శ్రేయాస్ అయ్యర్ నో హోప్…13 పరుగులు చేసి, ఎప్పటిలా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. గిల్ తో పోల్చితే ఒక పది శాతం బెటర్ అన్నట్టున్నాడు.
ఇక తొలి ఇన్నింగ్స్ లో కీలకంగా ఆడి, మ్యాచ్ ని నిలబెట్టి 87 పరుగులు చేసిన రవీంద్ర జడేజా కేవలం 2 పరుగులు చేసి అనూహ్యంగా రన్ అవుట్ అయి వెనుతిరిగాడు. కర్ణుడి చావుకి కారణాలనేకం అన్నట్టు టీమ్ ఇండియా ఓటమికి ఈ రన్ అవుట్ కూడా ఒక కారణమేనని చెప్పాలి.
ఇక చివర్లో వికెట్ కీపర్ కేఎస్ భరత్, అశ్విన్ ఇద్దరూ అద్భుతంగా పోరాడారు. ఒక దశలో మ్యాచ్ ను గెలిపించి సంచలనం సృష్టిస్తారని అనుకున్నారు. కానీ దురదృష్టం వెంటాడింది. ఇద్దరి పోరాటం వృథా అయిపోయింది. వీరిద్దరి పట్టుదల అందరి బ్యాటర్లలో ఉండి ఉంటే బాగుండేదని అంతా అనుకున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో టామ్ హార్ట్ లీ 7, జో రూట్ 1, జాక్ లీచ్ 1 వికెట్ తీసుకున్నారు.
చివరిగా టీమ్ ఇండియా కుర్రటీమ్ తో వెళితే ఇదే పరిస్థితి ఎదురవుతుందని, అప్పుడే నెట్టింట విమర్శలు మొదలయ్యాయి. విరాట్ కోహ్లీ రావాలని అంటున్నారు. లేదంటే ఛతేశ్వర్ పుజారా, అజ్యింక రహానె లాంటివాళ్ల అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
తాజాగా రంజీలో పుజారా డబుల్ సెంచరీ చేశాడు. సీనియర్లను తీసుకోవాలనే డిమాండ్లు పెరిగిపోతున్నాయి. మరి టీమ్ మేనేజ్మెంట్ ఏం చేస్తుందో చూడాల్సిందే.